దేశీ వినియోగమే వృద్ధికి దన్ను  | Domestic consumption is sustaining the growth momentum in the economy | Sakshi
Sakshi News home page

దేశీ వినియోగమే వృద్ధికి దన్ను 

Apr 25 2026 4:07 AM | Updated on Apr 25 2026 4:07 AM

Domestic consumption is sustaining the growth momentum in the economy

ప్రభావిత రంగాలకు అవసరమైతే ప్రభుత్వ సాయం 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

పుణె: దేశీ వినియోగం వృద్ధి వేగాన్ని నిలబెడుతోందని, ఇక మీదటా జీడీపీ మెరుగ్గా వృద్ధి చెందేందుకు స్పష్టమైన విధానపర మద్దతు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. 

దేశీ తయారీ, వ్యవసాయ రంగం బలమైన పనితీరు, పర్యాటకం, ఐటీ, అనుబంధ సేవల రంగాల నుంచి స్థిరమైన, విధానపరమైన మద్దతు లేకపోతే భారత్‌ వృద్ధి ప్రయాణం క్లిష్టంగా మారుతుందన్నారు. ఎగుమతులు సైతం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియలో ఘర్షణలతో దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వం తనవంతు మెరుగ్గా ఏం చేయగలదో చూస్తుందని చెప్పారు. 

యూఎస్‌ టారిఫ్‌ల ప్రభావిత సంస్థలకు ప్యాకేజీని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. థర్డ్‌ పార్టీ (వేరే సంస్థకు చెందిన) ఉత్పత్తుల పంపిణీకి ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునేలా బ్యాంక్‌లను అనుమతించాలా? లేదా? అన్న దానిపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) పరిధిలోని కమిటీ అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన∙తరుణంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలపై దృష్టి సారించాలని బ్యాంక్‌లకు సూచించారు. ఐడీబీఐలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.  

ఏఐపై లోతైన అధ్యయనం.. 
ఆంథ్రోపిక్‌ సంస్థ తీసుకొచ్చిన ‘మైథోస్‌’ కృత్రిమ మేధ (ఏఐ) నమూనాపై ఆందోళనల నేపథ్యంలో.. గురువారం ఢిల్లీలో బ్యాంక్‌లతో సమావేశం నిర్వహించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి నాయకత్వంలో (ఐబీఏ చైర్మన్‌ కూడా) పనిచేయాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను కోరినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement