బ్యారెల్ 120 డాలర్లకు వెళితే 6 శాతమే
ఈవై ఇండియా అంచనా
ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 120 డాలర్లకు చేరితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి 6 శాతానికి పరిమితం అవుతుందని ఈవై ఇండియా అంచనా వేసింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పెరిగిపోతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో విధానపరమైన జోక్యానికి పరిమిత అవకాశాలే ఉన్నట్టు ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం అలాగే కొనసాగితే భారత్ క్రూడ్ బాస్కెట్ ధరలు (ఐసీబీ) మరింత పెరగొచ్చని.. దీంతో విధానకర్తలు చమురు కొనుగోళ్లను వైవిధ్యం చేసుకోవచ్చని తెలిపారు. రెపో రేటును సైతం పెంచే అవకాశం ఉందన్నారు. చమురు ధర 120 డాలర్లకు ఎగసి, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావాన్ని ద్రవ్యలోటుపై తగ్గించుకోవాలంటే.. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచి వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారాన్ని మోపాల్సి ఉంటుందని అంచనా వేశారు. యూఎస్ ఇంధన సమాచార యంత్రాంగం 2026 క్యూ2లో (ఏప్రిల్–జూన్) బ్రెంట్ బ్యారెల్ ధర 115 డాలర్లకు చేరొచ్చని అంచనా వేయడాన్ని ఈవై నివేదిక ప్రస్తావించింది.
భారత్ వృద్ధి 2026–27లో 6.9 శాతంగా ఉండొచ్చన్ని ఆర్బీఐ అంచనా కాగా, 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొనడం తెలిసిందే. పశ్చిమాసియా సంక్షోభం అంచనాలకు మించి ఎక్కువ కాలం కొనసాగొచ్చని శ్రీవాస్తవ అంచనా వేశారు. ఒకవేళ ఇది సమీప కాలంలో పరిష్కారమైనా, ఆ తర్వాత ఇంధన సరఫరా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు.
ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్


