పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్త సేకరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
ప్రజలు ఐవీఆర్ కాల్స్ ఎత్తకపోతే పంచాయతీ కార్యదర్శులకు శిక్ష
శిక్షణ పేరుతో ఇంటింటికీ తిప్పి చెత్త సేకరించే పని అప్పగింత
చంద్రబాబు ప్రభుత్వంలో తమకు విలువ లేదని కార్యదర్శుల ఆవేదన
మార్కాపురం: బోడి గుండుకు.. మోకాలికి...అన్నట్టు ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. అమరావతి నుంచే వచ్చే ఐవీఆర్ కాల్స్ను కొన్ని గ్రామాల్లో ప్రజలు లిఫ్ట్ చేయలేదని పంచాయతీ కార్యదర్శులను ఇంటింటికీ తిప్పి చెత్తసేకరించే పని అప్పగింaచిన ఉదంతం మార్కాపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సుమారు 20 గ్రామ పంచాయతీల కార్యదర్శులను శుక్రవారం మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి తీసుకెళ్లి ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరించే పనులు చేయమని చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
రగిలిపోతున్న పంచాయతీ కార్యదర్శులు
పారిశుధ్యంపై శిక్షణపేరుతో తమ చేత ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ పనులు చేయించడంపై పంచాయతీ కార్యదర్శులు రగిలిపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులను శిక్షణ పేరుతో రాయవరం గ్రామానికి రప్పించి తడిచెత్త, పొడిచెత్త సేకరించే పనులు అప్పజెప్పారు. చెత్త సేకరించాక డంపింగ్ యార్డులకు పంపాలని ఆదేశించారు. మూడురోజుల శిక్షణ పేరుతో తమకు శిక్ష విధిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. జిల్లాలోని మొత్తం 60 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు పారిశుధ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


