బైక్పై వెళ్తుండగా వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ
ఘటనాస్థలిలో దంపతులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో తీవ్ర విషాదం
బైరెడ్డిపల్లె: భార్య, కూతురితో కలిసి బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు బలి తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో ఆదివారం రాత్రి వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తతో పాటు వారి కుమార్తె మృతి చెందారు. వివరాలు.. బైరెడ్డిపల్లె మండలంలోని మేకలనాగిరెడ్డిపల్లెకు చెందిన హేమచంద్ర (38) ఆదివారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని భార్య సరస్వతి (32), కుమార్తె లలిత (12)తో ద్విచక్రవాహనంపై వికోట మండలంలోని యడుగూరులోని అత్తవాళ్ల ఇంటికి బయలుదేరాడు.
మార్గమధ్యలోని పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలో కొమ్మరిమడుగు క్రాస్ వద్ద అతివేగంగా ఎదురుగా వచ్చిన ఓ లారీ హేమచంద్ర బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమచంద్ర, సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తె లలితకు తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరుకు తరలించగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం మేకలనాగిరెడ్డిపల్లికి మృతదేహాలు చేరుకున్నాయి. బంధువులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


