ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి మాతాశిశు మరణాల నివారణకు చర్యలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన డీఎంహెచ్వో సాధన
ఆదిలాబాద్టౌన్: ‘ఏజెన్సీ పరిధిలో మాతా శిశు మ రణాల నివారణకు చర్యలు చేపడతాం.. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం.. ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి..’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాధన అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమె బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?
డీఎంహెచ్వో: వానాకాలందృష్ట్యా అ ప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య సిబ్బందికి సూచించాం. జి ల్లాలోని ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చే స్తాం. జూలైలో ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపడతాం. డీఎంహెచ్వో కార్యాలయంలో కాల్సెంటర్ ఏ ర్పాటు చేసి 24గంటల పా టు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, డయేరియా వంటివి ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
సాక్షి: కొంత మంది సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
డీఎంహెచ్వో: వైద్యులు, సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపడతాం. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. పీహెచ్సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండాలి.
సాక్షి: డెంగీ, మలేరియా వ్యాధులపై ఎలాంటి ముందస్తు చర్యలు చేపడతారు..?
డీఎంహెచ్వో: వానాకాలంలో దోమ కాటుతో డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలుతాయి. గతేడాది జిల్లాలో నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపడతాం. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా అవగాహన కల్పి స్తున్నాం. వర్షపు నీరు నిల్వ ఉండడంతో అందులో దోమలు వృద్ధ చెంది వ్యాధులకు కారణమవుతాయి. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
సాక్షి: జిల్లాలో ఏమైనా మందుల కొరత ఉందా..?
డీఎంహెచ్వో: ప్రస్తుతానికి లేదు. వ్యాధుల సీజన్ కావడంతో డ్రగ్ స్టోరేజీలో అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం. పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్హెల్త్ సెంటర్లు, ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది వద్ద అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా చూస్తాం.
సాక్షి: కటాఫ్ విలేజ్లపై ఎలాంటి దృష్టి సారిస్తారు..?
డీఎంహెచ్వో: జిల్లాలో 192 కటాఫ్ విలేజ్లు ఉ న్నాయి. ప్రతీ పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీ మ్లను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల్లో ఉండే గర్భిణులను వారం రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలించడం జరుగుతుంది. హైరిస్క్ గర్భిణులను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఇంటికి వెళ్లిఅవసరమైనచర్యలు చేపడతాయి.
సాక్షి: వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.. ఎలా అధిగమిస్తారు?
డీఎంహెచ్వో: పీజీ విద్యకోసం 18 మంది వైద్యులు వెళ్లడంతో పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఆర్బీఎస్కే, జన్మన్ వైద్యుల ద్వారా సేవలు అందిస్తున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేలా చూస్తాం.
సాక్షి: మాతా శిశు మరణాల నివారణకు ఎలాంటి చర్యలు చేపడతారు..?
డీఎంహెచ్వో: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ఇదివరకు ఎనీమియాతో గర్భిణులు మృత్యువాత పడేవారు. ఇటీవల బీపీ కారణంగా చనిపోతున్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ఏఎన్ఎం, ఆశ, సూపర్వైజర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయిస్తాం. అవసరమైన వారిని వెంటనే రిమ్స్కు తరలించేలా చర్యలు చేపడతున్నాం.


