డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడిక వానాకాలం వచ్చినా పట్టించుకోని బల్దియా గతేడాది వెంటాడిన వరద కష్టాలు పాఠం నేర్వని అధికారులు
కై లాస్నగర్: వర్షాకాలం మొదలైంది. పట్టణంలోని చాలా డ్రెయినేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. పూడిక పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికే అవి పొంగి ప్రవహించే అవకాశముంది. ముందస్తు చర్యల్లో భాగంగా వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టాల్సిన బల్దియా యంత్రాంగం ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. గతేడాది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా పాఠం నేర్వని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పూడిక తొలగింపుపై అలసత్వం..
మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని విద్యానగర్, రాంనగర్, సుభాష్నగర్, రిక్షాకాలనీ, రిమ్స్, పంజాబ్చౌక్, శాంతినగర్, మహలక్ష్మివాడ, హౌసింగ్బోర్డు, ఖానాపూర్, తాటిగూడ, దస్నాపూర్ వంటి పలు కాలనీల్లో సుమారు 20కి పైగా భారీ డ్రెయినేజీలు ఉన్నాయి. వీటిలో కొ న్నింటిని పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు శు భ్రం చేయిస్తున్నారు. కొన్నింటిని జేసీబీలతో మా త్రమే శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్ర క్రియ సాగకపోవడంతో ఆయా డ్రెయినేజీల్లో చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే వరదంతా రోడ్లపై ప్రవహించే అవకాశముంది. గతేడాది ఇదే పరిస్థితి తలెత్తింది. వర్షాకాలం రాకముందే పూడికతీత పనులపై దృష్టి సారించాల్సిన బల్దియా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది కూడా మళ్లీ వరద ముంపు సమస్య తప్పకపోవవచ్చని ఆయా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకపాత్రలో బల్దియా ...
గతేడాది ఆలస్యంగా పనులు చేపట్టడంతో పంజాబ్ చౌక్లోని భారీ డ్రెయినేజీ ఉప్పొంగి మురుగునీరంతా రోడ్లపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాటిగూడ, మహాలక్ష్మివాడ కాలనీల్లోని ప లు ఇళ్లలోకి మురుగునీరు చేరింది. ఎగువ నుంచి వ చ్చిన వరదతో జీఎస్ఎస్టేట్ పూర్తిగా జలమయమైంది. దాని ఎదుట గల ప్రధాన పాత జాతీయ రహదారిపై ఐదారు గంటలు రాకపోకలు స్తంభించాయి. స్వయంగా కలెక్టర్ రాజర్షి షా అక్కడికి చేరుకుని పు నరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ సారి ఇప్పటి వర కు కనీసం వరద ప్రాంతాలను గుర్తించకపోవడం, టెండర్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో మళ్లీ ముప్పు తప్పవకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది.
త్వరలోనే పూడికతీత పనులు
పట్టణ పరిధిలో ఎన్ని వరద డ్రెయినేజీలు ఉన్నాయి.. గతేడాది ఏయే చోట్ల సమస్యలు తలెత్తాయనేదానిపై ఆరా తీస్తున్నాం. స్వయంగా కాలనీలకు వెళ్లి పరిశీలిస్తున్నాం. త్వరలోనే గుర్తించి పూడికతీత పనులు చేపట్టేలా టెండర్ల ప్రక్రియ చేపడతాం. ఒకవేళ ఆలస్యమైతే అడ్వాన్స్గానైనా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
– ఏ.జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో..
వార్డులు : 49
కుటుంబాలు 48,393
జనాభా : 1,50,383
ప్రధాన డ్రెయినేజీలు : 20


