ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమై న విద్య అందుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 4లక్షల 80వేల 700 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 4లక్షల 45వేల 170 పాఠ్య పుస్తకాలు వచ్చాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజే విద్యార్థులకు అందించేలా చర్యలు చేపడతున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ గౌడ్, సాంఘిక పాఠశాలల సమన్వయకర్త, ప్రిన్సిపాల్ లలిత కుమారి, టెక్స్బుక్స్ మేనేజర్ సత్యనారాయణ, రాజేశ్వర్, సంతోష్కుమార్ పాల్గొన్నారు.


