ఆదిలాబాద్టౌన్: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ అద్దెఇంటిపై, అతని బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్టనే విజయన్పై ఈడీ దాడులు అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయన్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని, ఇదే ఆయన నిజాయతీకి నిలువుటద్దంగా నిలుస్తోందన్నారు. ప్రతిపక్షాలను, ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుంటే కాంగ్రెస్ వంత పాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి, కిరణ్, ఆర్.సురేందర్, ఆర్.మంజుల, బొజ్జ ఆశన్న, నెల్ల స్వామి, రాములు, ఆశన్న, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.


