వర్షానికి తడిసిపోయిన జొన్న బస్తాలు
కొట్టుకుపోయిన జొన్నలను దోసిళ్లతో సేకరిస్తున్న రైతులు
అకాల వర్షం రైతులను కన్నీటిమయం చేసింది. ఆరుగాలం శ్రమించి పండించి న పంట దిగుబడులను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీల కొరతతో రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. సాత్నాల మండలంలోని మేడిగూడ(ఆర్) గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోసి న జొన్నలు తడిశాయి. కుప్పలపై టార్పాలిన్ కప్పినా మోకాలు లోతు వరదతో సుమారు వంద క్వింటాళ్ల వరకు తడిసిపోయినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. కాంటా పూర్తయి ఆరు రోజులైనా లారీల కొరతతో లోడింగ్ కాకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రైతు కుంచాల ప్రమోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, కలెక్టర్ రాజర్షి షా బుధవారం సాయంత్రం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన జొన్నలకు మద్దతు ధర కల్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. వెంటనే కాంటా పూర్తయిన వాటిని గోదాంలకు తరలించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు అకాల వర్షం కురిసింది. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన జొన్నల కుప్పలతో పాటు బస్తాలు తడిసిపోయాయి. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. – సాత్నాల/ఇంద్రవెల్లి


