-
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్గా పని చేసి రిటైరైన థియో వాన్డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
పచ్చదనంపై ప్రేమ, ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్నే పెంచేస్తోంది
పచ్చదనంతో కళకళలాడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. చాలామందికి చిన్నతనమంతా పల్లెల్లోనే గడుస్తుంది. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం లేదు. పల్లెటూళ్లంటే పండగలు, పబ్బాలు, సెలవలు గడపడానికి వెళ్లే పర్యాటక స్థలాలుగా భావిస్తున్నారు. అరవైపదుల వయసు వారు మాత్రం పల్లెల మట్టివాసనలు, పచ్చదనం పరిమళాలను ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నీలిమా దింగ్రా... తన చిన్ననాటి పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్నే పెంచేస్తోంది. తనలాగా పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికీ సలహాలు సూచనలు ఇస్తూ వారితో మొక్కలు నాటిస్తోంది. అరవై ఏళ్ల వయసులో ఇవన్నీ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నీలిమా దింగ్రా. ఢిల్లీకి చెందిన నీలిమా దింగ్రా స్టాండర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి, రూ.75 లక్షల పెట్టుబడితో నీలిమ దీనిని ప్రారంభించింది. కొద్దిసంవత్సరాల్లోనే కంపెనీని లాభాల బాట పట్టించింది. డిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు, ముంబైలో మరో రెండు కార్యాలయాలు నిర్వహిస్తూ సక్సెస్పుల్ ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తోంది. ఇంతపెద్ద వ్యాపారం చూసుకునేవారికి ఏమాత్రం తీరిక దొరికినా.. వయసు రీత్యా కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఇంట్లో డబుల్ డెక్కర్ గార్డెన్ను పెంచుతూ అబ్బురపరుస్తోంది. చిన్నప్పటిలా ఉండాలని... నీలిమ చిన్నప్పుడు హర్యాణాలోని రోహ్తక్లో పెరిగింది. అక్కడ ఎటుచూసిన పచ్చదనమే కనిపించేది. స్కూలు నుంచి రాగానే జామ చెట్టు కింద కూర్చుని అన్నం, స్నాక్స్ వంటివి తినేది. ఆకుపచ్చని పరిసరాల్లో పెరగడం వల్ల మొక్కలపైన ఎనలేని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యి చదువులు, పెళ్లితో పెద్దపట్టణంలో స్థిరపడింది. అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసిన కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ షో కోసం పెంచుతున్న ఒకటి రెండు మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందరికీ ప్రాణవాయువు ఇచ్చేంత పచ్చదనం మచ్చుకైనా కనిపించడంలేదు. పచ్చదనాన్ని ఇష్టపడే నీలిమ ఏ మాత్రం సమయం దొరికినా దగ్గర్లోని పార్క్కు వెళ్లేది. చల్లని సాయంత్రాల్లో పార్క్లో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది తనకు. అయితే కొద్దిరోజులకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో 2015 నుంచి పార్క్కు వెళ్లడం మానేసింది. పార్క్లో నడిచే సమయాన్నీ ఇంట్లో మొక్కలు నాటడానికి కేటాయించింది. ఇంట్లో ఒక మూలన కొద్దిపాటి స్థలంలో విత్తనాలు వేసింది. అవి చక్కగా మొలకెత్తడంతో ఆమె గార్డెన్ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇలా విస్తరిస్తూ రెండు అంతస్తుల్లో పచ్చటి గార్డెన్ను అభివృద్ది చేసింది. ఈ డబుల్ డెక్కర్ టెర్రస్ గార్డెన్ను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం విశేషం. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమయం కేటాయిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందమైన టెర్రస్ గార్డెన్ను నిర్వహిస్తోంది. పెంచుతూ పంచుతోంది.. తన డబుల్ డెక్కర్ గార్డెన్ పచ్చదనంతో కళకళలాడుతుండడం నీలిమకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషంతో మొక్కలను ఇతరులకు ఉచితంగా అందించేది. తన గార్డెన్లో పెరిగిన మొక్కల పిలకలు, అంటుకట్టడం ద్వారా వచ్చిన కొత్త మొక్కలను తెలిసినవారికి, గుళ్లకు ఇస్తోంది. ఇలా ఇప్పటి దాకా వెయ్యికి పైగా మొక్కలను పంచింది. నీలిమ గార్డెన్ చూసిన వారంతా మొక్కలు చక్కగా పెరగాలంటే ఏంచేయాలంటూ అని అడిగి మరీ నీలిమ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆసక్తితో శాంతి... ఇతరులు చిట్కాలు, సూచనలు తీసుకోవడం గమనించిన నీలిమ గార్డెనింగ్ జ్ఞానాన్నీ మరింతమందికి పంచాలన్న ఉద్దేశంతో ‘శాంతి క్రియేషన్స్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి గార్డెనింగ్ చిట్కాలు చెబుతోంది. నెటిజన్లు అడిగే సందేహాలను నివృత్తి చేస్తోంది. ఎక్కువ స్థలం లేనివారు వర్టికల్ గార్డెన్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, చీడపీడల నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలి. తక్కువ ఖర్చులో అందమైన గార్డెన్ను ఎలా పెంచుకోవాలి, వంటి సందేహాలకు చక్కని సలహాలు ఇస్తోంది. ఆరుపదుల వయసులో పచ్చదనంతో బిజీగా ఉంటూ నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
పచ్చదనం పెరిగింది!
గత 20 ఏళ్లలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చెట్లతో కూడిన విస్తీర్ణం (ట్రీ కవర్) పెరిగింది. 2000–2020 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13.09 కోట్ల హెక్టార్ల మేరకు ట్రీ కవర్ పెరిగిందని ‘ధరిత్రీ దినోత్సవం’సందర్భంగా వెలువరించిన ‘గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ’తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్ధ ‘వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్’కు అనుబంధంగా గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ పనిచేస్తోంది. మరోవైపు ఎక్కువ విస్తీర్ణంలోనే పచ్చని అడవుల నరికివేత కొనసాగుతోంది. ఈ 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా నికరంగా 10.06 కోట్ల హెక్టార్లలో అడవుల్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడిస్తోంది అయితే 36 దేశాల్లో మొక్కలు నాటడం, కలప తోటలు, పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున.. అడవులు, కలప/పండ్ల తోటలతో కలిపి పచ్చని చెట్ల విస్తీర్ణం నికరంగా పెరిగిందని గ్లోబల్ ఫారెస్ట్ పేర్కొంది. అయితే దీర్ఘకాలం ఎదిగిన అడవుల్ని నరికివేయటం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని.. తాజా ట్రీ కవర్ పూర్తిగా భర్తీ చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. పెరిగిన 13.09 కోట్ల హెక్టార్ల ట్రీ కవర్లో 91% (11.86 కోట్ల హెక్టార్లు) అడవులు ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన పెరుగుదలతో పాటు అడవుల పునరుద్ధరణ పథకాల అమలు ఇందుకు దోహదపడుతున్నాయి. మిగతా 9% (1.23 కోట్ల హెక్టార్లు)లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న యూకలిప్టస్, సుబాబుల్, ఆయిల్పామ్, రబ్బరు, పండ్ల తోటలు ఉన్నాయి. కలప తోటలు, పండ్ల తోటల సాగు ద్వారా పెరిగిన 1.23 కోట్ల హెక్టార్లలో దాదాపు సగం ఇండోనేసియాలోని ఆయిల్పామ్, బ్రెజిల్లోనే కలప తోటలే కావటం విశేషం. మలేసియా, ఉరుగ్వే, న్యూజిలాండ్ దేశాల్లోని ట్రీ కవర్లో 70% వాణిజ్య, ఉద్యాన తోటల వల్లనే సాధ్యమైంది. భారత్లో అడవులు, కలప / పండ్ల తోటలతో నికరంగా 8,74,100 హెక్టార్ల విస్తీర్ణంలో ట్రీ కవర్ పెరిగినట్లు గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ నివేదిక తెలిపింది. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో.. సియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇరవై ఏళ్లలో ట్రీ కవర్ నికరంగా పెరిగిన దేశాలు 36 ఉండగా అందులో చైనా, భారత్ కూడా ఉండటం విశేషం. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో నికరంగా ట్రీ కవర్ పెరిగింది. భారత్, చైనా సహా అనేక మధ్య, దక్షిణాసియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా చైనాలో.. అత్యధికంగా చైనాలో 21,44,900 హెక్టార్ల మేర ట్రీ కవర్ పెరుగుదల చోటు చేసుకుంది. భారత్లో 8,74,100 హెక్టార్ల మేర నికర ట్రీ కవర్ పెరుగుదల ఉంది. ఉరుగ్వే మినహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏ దేశంలోనూ ట్రీ కవర్లో నికర పెరుగుదల లేదు. అడవుల నరికివేత, కార్చిచ్చుల నష్టం అక్కడ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
గ్రీన్ రూఫ్టాప్లు.. నగరాలకు చలువ పందిళ్లు!
ప్రపంచవ్యాప్తంగా భవనాల పైకప్పులు ఆకుపచ్చగా మారుతున్నాయి. నగరాలను మరింత నివాసయోగ్యంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇళ్లు, వాణిజ్య భవనాల పైకప్పులు ‘గ్రీన్ రూఫ్’లుగా మారుతున్నాయి. అవి పూల మొక్కలు కావచ్చు లేదా కూరగాయ మొక్కలు కావచ్చు.. గ్రీన్ రూఫ్ల వల్ల ఒకటికి పది ప్రయోజనాలున్నాయని ప్రపంచం కోడై కూస్తోంది. ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా గ్రీన్ రూఫ్లు అందించే పర్యావరణ, ఆరోగ్య, ఆహార ప్రయోజనాలను గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు! సగం మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివాసం ఉంటున్నారు. 2030 నాటికి ఈ శాతం మరింత పెరుగుతుంది. భూతాపోన్నతి వల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా హెచ్చు తగ్గుల పాలవుతూ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. అతి వేడి, అతి చలి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. వాయు కాలుష్యానికి నగరాలే కేంద్ర బిందువులుగా మారాయి. ఇటీవలికాలంలో నగరాలు ఎదుర్కొంటున్న మరో ఉపద్రవం ఆకస్మిక కుండపోత వర్షాలు–వరదలు. ఇవి ప్రజల జీవన నాణ్యతను దెబ్బతీయటమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలనూ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ, సామాజిక, ఆరోగ్య సమస్యలకు గ్రీన్ రూఫ్లు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్లు పచ్చదనాన్ని నగరాల్లోకి తిరిగి తీసుకొస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్ అంటే? గ్రీన్ రూఫ్టాప్ గార్డెన్ (మిద్దె తోట) అంటే.. ఇంటి పైకప్పు మీద ఉండే ఆకుపచ్చని తోట. మెసొపొటేమియా జిగ్గురాట్ల కాలం నుంచే భవనాల పైకప్పులపై తోటలు పెంచుతున్నారు. గ్రీన్ రూఫ్లు ఆధునిక రూపాన్ని సంతరించుకోవటం జర్మనీలో 50 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. అప్పట్లో ఇది విడ్డూరంగా చెప్పుకునేవారు. అదే జర్మనీ ఇప్పుడు ‘ఐరోపా గ్రీన్ రూఫ్ క్యాపిటల్’గా పేరుగాంచింది. గ్రీన్ గార్డెన్... కంటికి ఆహ్లాదాన్నిస్తూనే, వేసవిలో చల్లదనాన్నీ/శీతాకాలంలో వెచ్చదనాన్నీ పంచుతూ విద్యుత్తును ఆదా చేస్తోంది. మిద్దెతోట... పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాన్ని, మూలికలను అందిస్తున్నాయి. ఇక విద్యుత్తును అందించే సౌర ఫలకాలూ గ్రీన్ రూఫ్ గార్డెన్కు కొత్త సొబగులను అద్దుతున్నాయి. రూఫ్ గార్డెన్ ఖర్చెంత? గ్రీన్ రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేయటం కొంచెం ఖర్చుతో కూడిన పనే. భవనం స్లాబ్ దెబ్బ తినకుండా ఉండేందుకు, నీటిని ఒడిసి పట్టేందుకు, మొక్కలు/చెట్ల వేర్లు స్లాబ్లోకి చొరబడకుండా నివారించడానికి, ఇన్సులేషన్ కోసం అనేక దొంతర్లు వేసిన తర్వాత.. ఆపైన మొక్కలు/చెట్లు పెంచేందుకు రూఫ్ పైభాగంలో మట్టి మిశ్రమాన్ని 6 నుంచి 12 అంగుళాల మందంతో వేస్తారు. ఆ తర్వాత పచ్చని మొక్కలు లేదా పంటలు వేస్తారు. ఇదంతా చెయ్యటానికి చదరపు అడుగుకు 15 నుంచి 20 డాలర్లు ఖర్చు అవుతుందని ఒక అమెరికా సంస్థ అంచనా. గ్రీన్ రూఫ్టాప్ గార్డెన్లకు జర్మనీ, అమెరికా, జపాన్, కెనడా, సింగపూర్ అతిపెద్ద మార్కెట్లుగా మారాయి. ఈ మార్కెట్ 2025 నాటికి 880 కోట్ల డాలర్లకు పెరగనుందని పరిశోధనా సంస్థ టెక్నావియో అంచనా. అయితే.. సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం వరకే అయితే పెద్దగా ఖర్చు అవసరం లేదు. కంటైనర్లు, కుండీలు, ఎత్తు మడుల్లో వేసుకోవచ్చు. రూఫ్ మొత్తాన్నీ కప్పి ఉంచేలా అనేక దొంతర్లుగా గార్డెన్ను నిర్మించాలనుకుంటేనే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంటిపంటలతో ప్రాణవాయువు 10 అడుగుల వెడల్పు, 10 అడుగులు పొడవు వుండే స్థలంలో పెరిగే మొక్కలు 13 అడుగులఎత్తయిన చెట్టుతో సమానంగా బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయని అంచనా. గ్రీన్ రూఫ్ మన దేశానికీ కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపిస్తోంది. పెద్ద నగరాల్లో గ్రీన్ రూఫ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుస్థిర జీవనం, పర్యావరణ స్పృహ కలిగిన నగరవాసులు సేంద్రియ ఆహారం ప్రాముఖ్యతను, సేంద్రియ ఇంటిపంటల సాగు ఆవశ్యకతను గ్రహిస్తున్నారు. కొసమెరుపు హైదరాబాద్ నగరంలో భవనాల పైకప్పుల విస్తీర్ణం కనీసం 50 వేల ఎకరాలకు పైగా ఉండొచ్చని ఒక అంచనా. దాదాపుగా ఈ రూఫ్లన్నీ ఖాళీగానే వున్నాయి. వీటిని గ్రీన్ రూఫ్ గార్డెన్లు గానో లేదా సేంద్రియ ఇంటిపంటల తోటలుగానో (సౌర ఫలకాలను కూడా వీటిలోనే పెట్టుకోవచ్చు) మార్చితే..? ఇదే మాదిరిగా ఇతర నగరాలూ, పట్టణాలను మార్చితే? పర్యావరణ పరంగా, ఆహార భద్రతా పరంగా, ప్రజారోగ్యపరంగా మహా అద్భుతమే ఆవిష్కృతమవుతుంది! – సాక్షి, సాగుబడి డెస్క్ నగరాలను చల్లబరిచే మార్గం పట్టణ ప్రాంతాల్లో భవనాల పైకప్పుల విస్తీర్ణం సాధారణంగా పట్టణ భూభాగంలో 5–35 శాతం వరకు ఉంటుంది. అమెరికాలో 90 శాతానికి పైగా భవనాల పైకప్పులు ఖాళీగా ఉన్నాయని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంచనా. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే నగర వాతావరణంలో 5.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక వేడి ఉంటుంది. దీన్నే ‘అర్బన్ హీట్ ఐలాండ్‘ అని పిలుస్తారు. గాలి కూడా సాధారణం కంటే వేడిగా ఉంటుంది. పైకప్పులు వేడిగా ఉన్నప్పుడు, భవనాల లోపలి గదులను చల్లబరచడం కష్టం. ఇది నగర విద్యుత్ గ్రిడ్పై అధిక భారాన్ని మోపుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరంలో వాయు కాలుష్యం కూడా తీవ్రమవుతుంది. ఉదాహరణకు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలో ఓజోన్ వాయువు సాంద్రత పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. అయితే.. భవనాల పైకప్పులపై కనీసం 30% విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు పెంచినప్పుడు దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వాతావరణం చల్లబడిందని బాల్టిమోర్–వాషింగ్టన్ మెట్రోపాలిటన్లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement