
' సచివాలయం ఫిరాయింపులకు నిలయం'
తెలంగాణ సచివాలయం పార్టీ ఫిరాయింపులకు నిలయంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
నల్గొండ: తెలంగాణ సచివాలయం పార్టీ ఫిరాయింపులకు నిలయంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో పార్టీ అధ్యక్షుడు అమిత్షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అందులో భాగంగానే టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కోదండరాంపై రాజకీయ దాడి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కోదండరాంపై టీఆర్ఎస్ ముప్పేట దాడి చేయడం సిగ్గు చేటన్నారు.
మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. మోదీ రెండేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ.2లక్షల కోట్లకు పైనే నిధులు కేటాయించారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని కృష్ణాబోర్డు వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే హైకోర్టు విభజన సమస్యను కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని లక్ష్మణ్ చెప్పారు.