‘స్థానిక’ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) ఎన్నికలు జరగనున్నాయి
కలెక్టరేట్, న్యూస్లైన్ :
‘స్థానిక’ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. ఈ మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకవర్గాల పదవీకాలం జూలై 2011తో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక పాల నను ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఎట్టకేలకు రంగం సిద్ధమైం ది. ఇక స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. నెల రోజుల్లో కొత్త పాలకవర్గం రానుంది.
నోటిఫికేషన్ విడుదల
జిల్లాలోని 52 జెడ్పీటీసీ స్థానాలకు, 636 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. 21న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 22న నామినేషన్ల తిరస్కరణ, 23న అభ్యంతరాల స్వీకరణ, 24 వరకు నామినేషన్లను ఉప సంహరణ సాయంత్రం 3 గంటల వరకు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 3 గంటల అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులను వివరాలు వెల్లడించనున్నారు.
ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 7న రీపోలింగ్కు అవకాశం ఉంది. ఏప్రిల్ 8న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు అనంతరం అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.