కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, కన్నయ్యకుమార్తో పాటు మరో 7 మందిపై దేశద్రోహ నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ
రాహుల్, కన్హయ్యలపై ఫిర్యాదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, కన్నయ్యకుమార్తో పాటు మరో 7 మందిపై దేశద్రోహ నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సరూర్నగర్ పోలీసులను ఆదేశించారు. వారు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశద్రోహానికి పాల్పడ్డారంటూ స్థానిక న్యాయవాది సుంకరి జనార్దన్గౌడ్ చేసిన ఫిర్యాదుతో మెజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారుడు జనార్దన్గౌడ్ కథనం ప్రకారం.. ఢిల్లీ జేఎన్యూలో ఫిబ్రవరి 9, 2016న కల్చరల్ ఈవెంట్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించి.. పార్లమెంటుపై దాడికి పాల్పడిన అఫ్జల్గురును కీర్తిస్తూ విద్యార్థులు కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్లు చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు మద్దతుగా రాహుల్గాంధీ, డి.రాజా, అజయ్ మతిన్, ఆనంద్శర్మ, సీతారాం ఏచూరి, కేసీ త్యాగి, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మాట్లాడి దేశద్రోహానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదుదారుడు సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కేసును విచారించిన మెజిస్ట్రేట్ 124, 124ఏ, ఆర్/డబ్ల్యూ 34 భారతీయ శిక్షా స్మృతి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి వచ్చే నెల 4న రిపోర్టు దాఖలు చేయాలని సరూర్నగర్ పోలీసులను ఆదేశించారు.