
సాక్షి, హైదరాబాద్: చిన్న ఘటన ఆసరాగా అధికారపక్షం పన్నిన వ్యూహానికి ప్రధాన ప్రతిపక్షం విలవిల్లాడిన తీరుకు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేదికయ్యాయి. ఎన్నికలకు ముందు ఆఖరి బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రభుత్వాన్ని కడిగేయాలనుకున్న కాంగ్రెస్.. కనీసం ఒక్కరోజు కూడా సమావేశాల్లో పాల్గొనకుండా కట్టడి చేయడంతో కుదేలైపోయింది. దీంతో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసే అవకాశం లేకపోయింది. ఇక దీనిపై ప్రజల్లోకి వెళ్లే అవకాశమున్నా సద్వినియోగం చేసుకోకుండా రెండు రోజుల దీక్షలు, నిరసనలతోనే సరిపెట్టింది. మొత్తంగా కాంగ్రెస్ రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొదటి రోజే షాక్..
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ సస్పెండ్ చేయడం, ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయడంతో ప్రతిపక్ష కాంగ్రెస్కు షాక్ తగిలింది. దాని నుంచి కోలుకునేందుకే కొంత సమయం పట్టింది. తర్వాత అప్పటికప్పుడు కొంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంది. న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించడం, కోమటిరెడ్డి, సంపత్ల చేత 48 గంటల నిరాహార దీక్ష చేయించడంతో.. కాంగ్రెస్ కేడర్లో కొంత ఉత్సాహం నెలకొంది. కానీ దీనిపై అధికారపక్షం నీళ్లు చల్లింది. జిల్లాల్లో అరెస్టులు, నిర్బంధాలు పెట్టి కాంగ్రెస్ కేడర్ను కదలకుండా చేయడంతో.. గాంధీభవన్లో జరిగిన దీక్ష తూతూమంత్రంగానే సాగింది. అయితే ఆ తర్వాతైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తిరిగి స్తబ్దత నెలకొంది.
దీక్షల నుంచి ఢిల్లీకి
దీక్ష అనంతరం ఏఐసీసీ ప్లీనరీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. రాష్ట్రపతిని కలవడానికి వారు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పార్టీ ప్లీనరీలో రాష్ట్రం అంశంపై చర్చించకపోయినా విషయాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తిరిగివచ్చాక ఈ నెల 20న సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని భావించినా.. న్యాయపరంగా ఎదుర్కొంటామంటూ ప్రకటన చేసి ఊరుకున్నారు.
కార్యకర్తల్లో నిర్వేదం
అధికారపక్షం ఇంత దూకుడుగా వ్యవహరించినా.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తేలిగ్గా తీసుకున్నారనే భావన పార్టీ కేడర్లో వ్యక్తమైంది. సభ్యత్వాలను రద్దు చేయడం, నేతల గన్మన్లను తొలగించడం వంటివి చేసినా.. పార్టీ నాయకత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తోందని కార్యకర్తలు నిర్వేదం వెలిబుచ్చుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆందోళనలేమీ చేయలేదని, కనీసం బంద్ పిలుపు వంటివీ ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు, రిలే దీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు, అవసరమైతే మరోసారి మూకుమ్మడి దీక్షలకు దిగడం వంటివి చేపడితే.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిల వైఖరిపైనా పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోకపోవడం దారుణమని అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వాపోతున్నాయి.