
నయనతార, త్రిష చిత్రం పేరు పోర పోక్కుల రెండు కాదల్?
నయనతార, త్రిష ప్రముఖ కథానాయికలుగా వెలుగొందుతున్నారు.
నయనతార, త్రిష ప్రముఖ కథానాయికలుగా వెలుగొందుతున్నారు. వీరిద్దరూ విడివిడిగా నటిస్తేనే ఆ చిత్రాలకు యమ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఈ అందాల రాశిలిద్దరు ఒకే చిత్రంలో కలిసి నటిస్తే? ఆ చిత్రానికి పెరిగే క్రేజే వేరు. ఇంతకు ముందు బద్ద శత్రువులుగా ఉన్న త్రిష, నయనతార ఇటీవల స్నేహితులుగా మారిపోయారు. పార్టీలు, ఇతర కార్యక్రమాలకు కూడా ఇద్దరూ కలిసే వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా త్రిష, నయనతార కలిసి ఒక చిత్రంలో నటించనున్నారన్న వార్తను ఇంతకు ముందే పాఠకులకు తెలియజేశాం. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటంటే ఈ చిత్రానికి నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్శివ దర్శకత్వం వహించనున్నారు. హీరోగా ఇంతకు ముందు శివకార్తీకేయన్ నటించనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన ప్లేస్లో విజయ్సేతుపతి వచ్చి చేరారు.
నయనతార, విజయ్సేతుపతి జంటగా విఘ్నేశ్శివ దర్శకత్వంలో తెరకెక్కిన నానుమ్ రౌడీదాన్ చిత్రం విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తన తదుపరి చిత్రంలో నయనతారతో పాటు త్రిష కూడా నటిస్తే బాగుంటుందని దర్శకుడు భావించడం, ఈ విషయాన్ని నయనతార త్రిషకు చెప్పడం ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
ఇంతకు ముందే ఒక కార్యక్రమంలో నయనతారతో కలిసి నటించాలనే ఆకాంక్షను త్రిష వ్యక్తం చేశారన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, తాజాగా వేదాళం చిత్రంతో హిట్ కొట్టిన శ్రీసాయి రామ్ ఫిలింస్ అధినేత ఏఎం రత్నం నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి పోర పోక్కుల రెండు కాదల్ అనే టైటిల్ను నిర్ణయించినట్లు ప్రచారంలో ఉంది. ఇద్దరు ప్రియురాళ్ల మధ్య ప్రేమికుడు పడే పాట్లే ఈ చిత్ర కథ అని సమాచారం.