
ఆ 40 రోజులూ పడినంత కష్టం ఎప్పుడూ పడలేదు
హిమాలయాల్లో ఒక్కరోజైనా విహార యాత్ర చేయాలని అందరికీ కోరిక ఉంటుంది. అలాంటిది 40 రోజులు అక్కడే గడపాల్సి వస్తే
హిమాలయాల్లో ఒక్కరోజైనా విహార యాత్ర చేయాలని అందరికీ కోరిక ఉంటుంది. అలాంటిది 40 రోజులు అక్కడే గడపాల్సి వస్తే...? హీరో నానీకి అలాంటి అవకాశం దక్కింది. నాని, మాళవికా నాయర్ జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకా దత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. స్వప్న సినిమా పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ హిమాలయాల్లో చేశారు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో నాని పంచుకున్నారు.
హిమాలయాల్లో 40 రోజులు షూటింగ్ చేయాలన్నప్పుడు ఎలా అనిపించింది?
చాలా కొత్తగా ఉంటుందనుకున్నాను. కాకపోతే అక్కడ ఓ రేంజ్లో కష్టపడతామని మాత్రం ఊహించలేదు. హైదరాబాద్ నుంచి దాదాపు 35 మంది హిమాలయాలకు ఎంతో హుషారుగా వెళ్లాం. వెళ్లిన తర్వాత తెలిసింది...
ఏం తెలిసింది?
అక్కడ షూటింగ్ చేయడం మామూలు విషయం కాదని. చాలా చలిగా ఉండేది. ఎంత చలి అంటే... గ్లాసులో నీళ్లు నిమిషాల్లో తాగేయాలి. లేకపోతే గడ్డ కట్టిపోతాయ్. శరీరాన్నంతా ప్యాక్ చేసుకున్నట్లుగా దుప్పట్లు, రగ్గులు కప్పుకునేవాళ్లం. షూటింగ్ లొకేషన్లో అందరూ అలానే ఉండేవాళ్లు. కానీ, ఆర్టిస్టులకు అలా కుదరదు కాదు. సీన్ చేసే ముందు దుప్పట్లు, నెత్తి మీద టోపీలు అవీ తీయాలంటే భయం వేసేది. ఇంకో విషయం చెబితే నవ్వుతారేమో. స్నానం చేసిన రోజులు చాలా తక్కువ (నవ్వుతూ...). నా జీవితంలో ఆ 40 రోజులు పడినంత కష్టం ఎప్పుడూ పడలేదు.
ఈ సందర్భంలో మీ శ్రీమతి అంజన అలిగారట?
అలగలేదు. చాలా బాధపడింది. ఎందుకంటే సరిగ్గా నేనక్కడ ఉన్నప్పుడే అంజన నాన్నగారు చనిపోయారు. విషయం తెలియగానే నేను హైదరాబాద్ చేరుకోవడానికి నాలుగైదు ఫ్లయిట్లు మారాల్సి వచ్చింది. మామయ్యగారి మరణం ఓ షాక్. ఆ బాధ నుంచి అంజన తేరుకునేవరకూ నేను తనతో ఉండలేకపోయాను. కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే ఉండి షూటింగ్కి వెళ్లిపోయాను. అది నాక్కూడా బాధ అనిపించింది. కానీ, యూనిట్ మొత్తం ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు రోజులు వృథా చేయకూడదు కదా!
పర్వతాలు ఎక్కేటప్పుడు ఏమనిపించింది?
మేం అక్కడ ఉన్న 40 రోజుల్లో 15 రోజులు నడకకే సరిపోయింది. ఒక చోట షూటింగ్ చేసి, మరో చోటికి చేరుకోవడానికి ఒకటిన్నర, రెండు రోజులు పట్టేది. ఆ 40 రోజుల్లో మేమంతా దాదాపు నాలుగైదు కిలోల బరువు తగ్గామంటే అతిశయోక్తి కాదు. ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. పైగా 5,400 మీటర్లు ఎత్తుకు వెళ్లే సరికి ఆక్సిజన్ సరిగ్గా అందలేదు. ఒకానొక దశలో క్షేమంగా వెనక్కి తిరిగి వస్తామా అని సందేహం కూడా వచ్చింది.
అంతలా కష్టపడేంతగా ఈ కథలో ఉన్న ఆసక్తికరమైన అంశం ఏంటి?
ఇందులో నా పాత్ర పేరు సుబ్రమణ్యం. పెద్ద వ్యాపారవేత్తని. ఎమోషన్స్ లేని మనిషిని. అసలు తనెలాంటివాడు? తన చుట్టూ మనుషులు లేకపోతే ఎలా ఉంటాడు? అని సుబ్రమణ్యం తెలుసుకోవాలనుకుంటాడు. చిత్రదర్శకుడు నాగ అశ్విన్ ఈ కథ చెప్పగానే కొత్తగా ఉందనిపించి, అంగీకరించాను. షూటింగ్ చేసిన ప్రతిరోజూ నాకు సంతృప్తి కలిగింది.
షూటింగ్ పూర్తయ్యిందా?
ఇంకో మూడు, నాలుగు రోజులు చేస్తే పూర్తవుతుంది. కానీ, హిమాలయాల్లో కాకపోవడం ఓ రిలీఫ్.
మిమ్మల్నెంతగానో కష్టపెట్టిన సినిమా కదా.. ఎలా అనిపిస్తోంది?
అది చాలా విలువైన కష్టం. హిమాలయాల్లో చేసిన షూటింగ్ తాలూకు విజువల్స్ చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. రేపు సినిమా చూసినవాళ్లు మంచి అనుభూతితో బయటికొస్తారు. పైగా... సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు వినోద ప్రధానంగా సాగుతుంది. సో.. కష్టం మాకు..! నవ్వులు ప్రేక్షకులకు!
అశ్వనీదత్గారి కుమార్తె సంస్థకు సినిమా చేయడం గురించి?
వైజయంతీ మూవీస్ సంస్థలో సినిమా చేయాలనే కల చాలామందికి ఉంటుంది. ఒకప్పుడు ఆ కల నెరవేర్చుకోవడానికి ఆ ఆఫీసుకెళ్లి, అశ్వినీదత్గారిని కలిశాను. ‘ఇప్పుడే సినిమాలెందుకయ్యా.. చక్కగా చదువుకో’ అన్నారాయన. అప్పుడు అవకాశం అడిగిన కుర్రాణ్ణి నేనే అని అశ్వినీదత్గారికి గుర్తు లేదు. నేను గుర్తు చేస్తే నవ్వారు. ఒక మంచి బేనర్లో, మంచి సినిమా చేయడం.. అది కూడా ప్రపంచంలో ఇప్పటివరూ ఏ సినిమా షూటింగ్ కూడా హిమాలయాల్లో చేయనన్ని రోజులు, చేయని లొకేషన్స్లో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది.