రాజకీయ నాయకుల హైరానా | political leaders have tension about results | Sakshi
Sakshi News home page

రాజకీయ నాయకుల హైరానా

May 9 2014 1:34 AM | Updated on Aug 29 2018 8:56 PM

పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...ఇక కౌంటింగే అనుకునే లోపే రాష్ట్రవిభజన ప్రక్రియ మొదలైంది. దీంతో అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు కూడా హైరానా పడుతున్నారు.

 సాక్షి, ఖమ్మం:  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...ఇక కౌంటింగే అనుకునే లోపే రాష్ట్రవిభజన ప్రక్రియ మొదలైంది. దీంతో అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు కూడా హైరానా పడుతున్నారు. విభజనకు సంబంధించిన పనులు  త్వరగా పూర్తి చేయాలంటూ ప్రభుత్వం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు రాగా, మరోవైపు కౌంటింగ్ ఉండడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రాజకీయ నాయకులైతే ఫలితం ఎలా ఉంటుంది, కొత్త రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయోనని  గుబులుగుబులుగా ఉన్నారు.
 
 పరిషత్, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగించింది. ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అధికారులు ఆ వెంటనే కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధముయ్యారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు ఈ మూడు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లపై  ఇతర సిబ్బందితో పలుధపాలు సమావేశాలు నిర్వహించారు. 12న మున్సిపల్, 13న పరిషత్, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఇప్పటికే ప్రాథమికంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అధికారులు దృష్టి అంతా కౌంటింగ్‌పై పెట్టగా.... గవర్నర్ ఈనెల 15లోపే విభజనకు సంబంధించిన పనులు అంతా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. జిల్లాలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ఇందులో నాన్‌లోకల్ కింద ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్, జిల్లా స్థాయి కేడర్ ఎంతమందో అధికారులు లెక్కల్లో మునిగారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులు, పద్దులు లెక్కిస్తున్నారు.
 
 ఈనెల 24నే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వనుండడంతో సంబంధిత అధికారులు ఈ పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాకు నూతనంగా ఏర్పాటయ్యే రాష్ట్రంలోని  తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు సరిహద్దుగా ఉండడంతో ఇక్కడ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేయడం తప్పనిసరి. అయితే జిల్లాలోని ఏగ్రామాలు ఈ జిల్లాలకు సరిహద్దున ఉన్నాయి, ఎక్కడ ఈబోర్డులు ఏర్పాటు చేయాలన్న విషయమై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ, అక్కడ ఉద్యోగులు, పోలవరం ముంపు మండలాలు, గిరిజన జాతులు తదితర వివరాలన్నీ జిల్లా అధికారులు రాజధానికి పంపించాలి. గవర్నర్ ఆదేశించినట్లుగా ఇవన్నీ గడువులోపే పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఉన్న సిబ్బందితోనే విభజన పనులు..., మూడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు అధికారులు ఉపక్రమించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహాయిస్తే తెలంగాణలో మన జిల్లాలోనే విభజన ప్రక్రియకు సంబంధించి పనులు ఎక్కువగా ఉండడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
 
 కొత్త రాష్ట్రం...ఫలితాలు....
 నూతన రాష్ట్రం ఏర్పాటు కానున్న తరుణంలో....వరుసగా వచ్చే ఫలితాలపై బరిలో ఉన్న అభ్యర్థులు, పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితాల శంఖారావం మున్సిపల్ నుంచి ప్రారంభమవుతుండడంతో ఇక్కడ ఎవరు విజయకేతనం ఎగురవేస్తారోనని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆవెంటనే పరిషత్ ఎన్నికలు, రెండు రోజుల తేడాతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కొన్ని పార్టీలు తొలి ఫలితాలతోనే తమ ప్రభంజనం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని పార్టీలు నైరాశ్యంలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి కొత్తగా ఏర్పాటు అయ్యే తొలి తెలంగాణ ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ప్రతిపార్టీ ఊవ్విళ్లూరుతోంది.
 
 అనుకూలమా.. ప్రతికూలమా..?

 ప్రధానంగా అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయా పార్టీల అధినేతలు జోస్యం చెబుతున్నా... ఈవీఎంలలో నిక్షిప్తమైన తమ భవితవ్యం ఏమవుతుందోనని అభ్యర్థులు ఆందోళనచెందుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే కొందరు అభ్యర్థులు తమకు కొత్త రాష్ట్రంలో లభించే పదవులపై ఆశల పల్లకిలో విహరిస్తుండడం గమనార్హం. విజయం సాధిస్తే మంత్రి వర్గంలో తప్పకుండా బెర్తు దక్కుతుందని వారు తమ అనుంగుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా... విభజన ప్రక్రియ, కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు తలమునకలైతే.. ఎన్నికల ఫలితాలు, కొత్త రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపై పార్టీల నేతలు, అభ్యర్థులు అంచనాల్లో తేలియాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement