
చివరి సంతకం...
తెలుగు కథకు కళను అద్దిన చివరి సంతకమది. పేరు కరుణాకర్. ఆ సంతకం వెంట నడుస్తూ దానిపై అల్లుకున్న నీటి రంగు పూల అల్లికతో సాగిన జీవితం, ఆగిన జ్ఞాపకం ఇది.
నివాళి
తెలుగు కథకు కళను అద్దిన చివరి సంతకమది. పేరు కరుణాకర్. ఆ సంతకం వెంట నడుస్తూ దానిపై అల్లుకున్న నీటి రంగు పూల అల్లికతో సాగిన జీవితం, ఆగిన జ్ఞాపకం ఇది.
తెలుగు పత్రికా చిత్రకళ రేఖ, రంగు, రూపం మా తరం తలకెక్కుతున్న రోజులవి. 1990ల మొదలు. పత్రికల పేజీల నిండా నిలువుగా, అడ్డంగా, పలు కాలమ్స్గా, పొట్టి ఫిల్టర్స్గా అచ్చైన బొమ్మలు. అన్నిటా కరుణాకర్ బొమ్మలే అయిన రాజ్యంలో మా తరం ప్రయాణం మొదలైంది. తెలుగు బొమ్మల్లో మహానుభావులు కొందరే అయినా శైలులు ఎన్నో. సొగసైన బాపు బొమ్మ. నాజుకులొలికే బాలి బొమ్మ, లోగుట్టులన్ని చంద్రకే ఎరుకున్న బొమ్మ, కుంచె వేగానికి బెదిరి పాఠకుడి వల్లో వాలబోతున్న గోపి బొమ్మ. ఈ జంతర మంతరంలో నిండుగా, గుండె నిండుగా నిలబడి, నిలబెట్టి కవ్వింపుని రువ్వింది మాత్రం కరుణాకర్ కుంచే. తెలుగు కథకు గ్లామర్నిచ్చింది కరుణాకర్ బొమ్మే.
కరుణాకర్ బొమ్మ పొడవెంతో తెలుసు. ఆ కుంచె రాల్చిన అమ్మాయి బరువెంతో తెలుసు. ఆ గుండ్రాల నిండా పెద్ద కండ్ల నలుపులో నిలువునా ములిగిపోయి తేలలేక పోయిన పాఠకుల చరిత్ర తెలుసు. కరుణాకర్ గురించే బొత్తిగా తెలీదు. ఆయనక్కూడా పంజగుట్ట పెన్నా హోటల్ ఫస్ట్ ఫ్లోర్లోని ‘ఆధునిక’ స్టూడియో, సనత్నగర్ ఎస్సార్ట్టీ 301లోని తన ఇల్లు, నలభై పత్రికల ఫోన్ నంబర్లు తప్ప నలుగురు చిత్రకారుల ఫోన్ నంబర్లు కూడా తెలీవు. ఇదే ప్రశ్న ఓ మధ్యాహ్నపు టీ ముందు ‘ఎందుకని సార్... మీరు ఏ ఆర్టిస్ట్తోనూ కలవరు. ఏ సభల్లోనూ కనపడరూ’ అని అడిగితే కాసింత చిరునవ్వును సిగరెట్ పొగతో కలిపి ఇలా అన్నాడు-
‘ఎందుకబ్బా ఏ ఇద్దరు ఆర్టిస్టులు కలిసినా చేసే పని మూడో ఆర్టిస్ట్ని తిట్టుకోవడమే కదా’. ఆయన ’70లలో బొమ్మలు మొదలుపెట్టారు. 2013 సెప్టెంబర్ 12 మధ్యాహ్నం వరకూ బొమ్మలే వేశారు, రంగులే పూశారు తప్ప ఏ రెండో వాడి గురించి పొల్లు మాట అనింది లేదు, మూడో వాడి పైన నాలుక నూరిందీ లేదు.
ఇదంతా వ్యక్తిగతం అయినా అది ఆయన వ్యక్తిత్వం.
నిజానికి తెలుగులో ఇలస్ట్రేషన్ని మాత్రమే నమ్ముకుని జీవిక సాగించిన వాళ్లు చాలా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చేతి వేళ్లన్నీ గుప్పిట మూసి రెండు వేళ్లు మాత్రమే తెరవొచ్చు. మహా అయితే మరో వేలు. ఈ ఒకరిద్దరిలోనూ పక్కా ప్రొఫెషనల్ ఇలస్ట్రేటర్ అంటే కరుణాకర్ ఒక్కరే. ఎంత ప్రొఫెషనల్ అంటే కథలో వున్న విషయం సాంఘికమా, పౌరాణికమా, చారిత్రకమా అనే తేడా లేదు. దేన్నయినా కుదిరించే వారు. ముఖ్యంగా కరుణాకర్ బొమ్మల్లో పలికినంత ఎరొటిక్ ఎస్సెన్స్ మరెవరి బొమ్మల్లో పలికేది కాదు. శృంగారం చిలికేది కాదు. కథలోని థీంని కాకుండా సన్నివేశాన్ని వున్నది వున్నట్టు వేయడమే ఆయన శైలి. పండుగలు వచ్చాయంటే పత్రికల ముఖచిత్రాలన్నీ ఆయన దేవతా మూర్తులతో, కావ్యనాయికలతో నిండిపోయేవి. పచ్చని ప్రకృతి, పిట్టల కిలకిలారావాలు కవర్ పేజీ పై నుండి పలికేవి. ఆయన బలం రంగులు. అవి లేకుండా కరుణాకర్ బొమ్మ వూహకు సాధ్యం కాదు.
నలుపు తెలుపుల్లో బొమ్మ వేయాల్సి వచ్చినా కాసింత గ్రే వాష్ని కుంచెకద్దుకొని అందులోనే సప్తవర్ణాలకు చోటు చూసుకునేవాడు. గత 30 ఏళ్లుగా తెలుగులో గల చిన్నా పెద్ద పత్రికలన్నిటికీ దాదాపు 90 శాతం కరుణాకర్ ఒక్కరే బొమ్మలు వేశారు. ఆయనలోని మరో గొప్ప విషయం సమయానికి బొమ్మలు అందించడం. రోజంటే రోజే. గంటంటే గంటే. చెప్పిన సమయానికి చెప్పినట్టు బొమ్మ ఇచ్చేవారాయన. ఆయన నిష్ర్కమణతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయగల మరొక్క చిత్రకారుడు తెలుగు నాట లేడు కాక లేడు. ఇంతటి క్వాలిటీస్తో బొమ్మలు వేయగలవారెవరా అని ఎదురు చూడ్డమే ఇక మిగిలింది. జీవితమంతా తన పని తాలూకు సౌరభాన్ని, సౌందర్యాన్ని తెలుగులో కొన్ని తరాలకు పంచిన కరుణాకర్ గుండె ఆగినప్పుడు ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చినవారు కేవలం పదిమంది చిత్రకారులు.
ఒక రచయిత, ఒక సంపాదకుడు. కడుపులో చల్ల కదలకుండా ఫేస్బుక్లో 26 లైకులు, 82 కామెంట్లు, అందులో 19 రిప్పులు. నిజానికి తెలుగునాట ఆయనతో తమ కథలకు బొమ్మ వేయించుకోని రచయిత లేడనే చెప్పాలి. ఆయనతో పని చేయించుకోని పత్రిక లేదనే రాయాలి. అయినా చిన్న నివాళి కోసం లేక ఆ ఆగిన గుండె మళ్లీ కొట్టుకునే ఉంటుంది. ఏది కళ అవుతుందో, దేని వల్ల సంస్కృతి సుసంపన్నం అవుతుందో దాని తాలూకు స్పర్శ జ్ఞానం లేని నా జాతికి నా తోటి కళాకారుల తోడ శిరసు వంచి పాదాభివందనం.
- అన్వర్
(మొన్నటి గురువారం హైద్రాబాద్లో ప్రఖ్యాత చిత్రకారుడు కరుణాకర్ మృతి చెందారు. ఆయన స్వస్థలం వైజాగ్.
1953లో జన్మించారు. జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్లో ఫొటోగ్రఫీలో బి.ఎఫ్.ఎ చేశారు. తెలుగు చిత్రకారుల్లో కరుణాకర్ వేసినన్ని బొమ్మలు బహుశా ఎవరూ వేసి ఉండరు)