
భర్తను అంతమొందించిన భార్య అరెస్టు
అల్లుడితో వివాహేతర సంబంధం నెరుపుతూ తాళికట్టిన భర్తనే అడ్డుగా భావించి చివరకు భర్తను అంతమొందించిన కేసులో భార్య నాగసుబ్బమ్మతో పాటు అల్లుడి బంధువు పాలకొండయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
అట్లూరు : అల్లుడితో వివాహేతర సంబంధం నెరుపుతూ తాళికట్టిన భర్తనే అడ్డుగా భావించి చివరకు భర్తను అంతమొందించిన కేసులో భార్య నాగసుబ్బమ్మతో పాటు అల్లుడి బంధువు పాలకొండయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రామాంజినాయక్, స్థానిక ఎస్ఐ మహమ్మద్రఫిలు కేసు వివరాలు వెల్లడించారు. రెడ్డిపల్లె గ్రామానికి చెందిన డబ్బుగొడ్ల వెంకటయ్య, ఆయన భార్య నాగసుబ్బమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండవ కుమార్తెను ఒంటిమిట్ట మండలం అమ్మోరుపల్లెకు చెందిన వెంకటశేషయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే నాగసుబ్బమ్మ కూతురికి పెళ్లి అయినప్పటి నుంచి అల్లుడు వెంకటశేషయ్యతో వివాహేత సంబంధం పెట్టుకుని అడ్డుగా భావించిన భర్తను ఎలాగైనా అంతమొందించాలని భావించింది. ఈ నెల 4వ తేదీన ఒంటిమిట్ట మండలం అమ్మోరుపల్లెకు చెందిన తన అల్లుడి సమీప బంధువు పాలకొండయ్యను పురమాయించుకుని సోమశిల ముంపు ప్రాంతమైన చెండువాయి గ్రామ సమీపాన యల్లమ్మ ఆలయం వద్దకు భర్త వెంకటయ్యను తీసుకెళ్లి మద్యం తాపించి బండరాళ్లతో తలపై కొట్టి అంతమొందించింది. విచారణలో భార్యే భర్తను హత్య చేసిందిని తేలిందని, ఆమెతో పాటు పాలకొండయ్యను అరెస్టు చేశామని, వీరిని మంగళవారం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు.