ఏడుగురి బలవన్మరణం

Seven Members Commits Suicide in One day Hyderabad - Sakshi

హైదరాబాద్‌ నగరంలో ఒకే రోజు వేర్వేరు కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఓ యువతి సహా ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు మంగళవారం చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రేమ విఫలమై.. యువకుడు..
మారేడుపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి సెకండ్‌ లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న రవిచైతన్య (21) బేగంపేట్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను గత కొంత కాలంగా ఓల్డ్‌ మారేడుపల్లికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతి అతడి ప్రతిపాదనను తిరస్కరించడంతో మనస్తాపానికి లోనైన రవి చైతన్య సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆర్థిక ఇబ్బందులతో పాలవ్యాపారి..
దూద్‌బౌలి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ పాల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్‌ డీఐ నరేశ్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన అమిత్‌ గుప్తా (40) నగరానికి వలస వచ్చి కుటుంబంతో సహా శివరాంపల్లిలో ఉంటున్నాడు. నాలుగు నెలలుగా అతను చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మోతీబేగం మసీదు వద్ద పాలు, పాల పదార్థాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి రూ.12 లక్షల అప్పులు ఉండటంతో వీటిని తీర్చలేక మనస్తాపానికి లోనయ్యాడు. మంగళవారం ఉదయం  దుకాణాన్ని తెరిచిన అమిత్‌ గుప్తా మధ్యాహ్నం దుకాణంలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య సరళ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఉరివేసుకుని యువతి..
గచ్చిబౌలి : గెస్ట్‌ హౌస్‌లో ఉంటున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం, గుర్గావ్‌ ప్రాంతానికి చెందిన మౌనికరావు (25) గచ్చిబౌలిలోని ఓయోలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ రాజరాజేశ్వరీ కాలనీలోని కాకతీయ రెసిడెన్సీలో ఉంటోంది. ఆదివారం రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లిన ఆమె బయటికి రాలేదు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె స్నేహితుడు రీహాన్‌ అక్కడికి వెళ్లాడు. డోర్‌ దగ్గరకు వేసి ఉండడంతో తలుపు తీసి చూడగా మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. రీహాన్‌ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె సోదరుడు అమీత్‌కు  అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

భార్యతో గొడవపడి యువకుడు..
గచ్చిబౌలి : భార్యతో గొడవపడి మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ దేవేందర్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా, గట్టురయపాకల గ్రామానికి చెందిన గౌనీ బొగురయ్య (30) ఎనిమిదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గచ్చిబౌలి, అంజయ్యనగర్‌లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అదే ప్రాంతంలో ఉంటున్న అత్తవారింట్లో ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉండగా తాను రానని చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో భార్య పద్మ, మామ వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన అతడి భార్య కిటికీలో నుంచి చూడగా బొంగురయ్య సీలింగ్‌ రాడుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా సోమవారం ఉదయంభార్యభర్తల మధ్య గొడవ జరిగిందని ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

ప్రేమను నిరాకరించిందని..
మైలార్‌దేవ్‌పల్లి: ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ విశాఖ జిల్లాకు చెందిన కోటేశ్వరరావు(25) తన తండ్రితో కలిసి మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో పదిహేనేళ్లుగా నివాసముంటున్నాడు. అతడు ఆర్కేస్ట్రా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో అతడికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నూతన సంవత్సర వేడుకల్లో ఆమెను కలిసిన కోటేశ్వరరావు ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఉరివేసుకుని మహిళ..
అల్వాల్‌: ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వరప్రసాద్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, మల్లేపల్లికి చెందిన రవి,రాజేశ్వరి(33) దంపతులు నగరానికి వలసవచ్చి అల్వాల్, మంగాపురం కాలనీలో ఉంటున్న దామోదర్‌రెడ్డి వద్ద పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజేశ్వరి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కులాయప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top