హిజ్రాపై ప్రియుడి హత్యాయత్నం

Boyfriend Attack On Transgender Lover Warangal - Sakshi

డబ్బులు కావాలంటూ వేధింపులు

రూ.2లక్షలు ఇచ్చిన హిజ్రా మళ్లీ రూ.3లక్షల డిమాండ్‌

ఇవ్వకపోవడంతో కత్తితో గొంతు కోసిన వైనం

మానుకోట ఆస్పత్రిలో చేరిన బాధితురాలు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన ఓ హిజ్రాతో సహజీవనం చేస్తున్న ప్రియుడు కత్తితో గొంతు కోసి హత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, హిజ్రా అమ్మమ్మ బానోతు జంకు కథనం ప్రకారం... బానోత్‌ రాధిక అనే హిజ్రాకు, మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామ శివారు కొత్తతండాకు చెందిన ధరావత్‌ సురేష్‌తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి మహబూబాబాద్‌ పట్టణంలోని హనుమంతరావు స్థూపం సమీపంలో అద్దె ఇంట్లో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే డబ్బులు కావాలని సురేష్‌ కొద్ది నెలలుగా రాధికను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె రూ.లక్ష ఇచ్చింది.

ఆతర్వాత కూడా మరో రూ.లక్ష కావాలని వేధింపులకు గురిచేస్తుండటంతో మళ్లీ రూ.లక్ష ఇచ్చింది. ఆతర్వాత మళ్లీ రూ.3లక్షలు కావాలంటూ వారం రోజులుగా వేధిస్తున్నాడు. డబ్బులు లేవని చెబుతుండటంతో బానోత్‌ రాధికను దూషిస్తూ చితకబాదుతున్నాడు. సురేష్‌ తల్లి సాలి కూడా మూడు రోజుల క్రితం వచ్చి డబ్బులు ఇవ్వకపోవడంపై దూషించింది. ఈ క్రమంలో సురేష్‌ హిజ్రా రాధికను వేధిస్తూనే రాత్రి ఆమె అమ్మమ్మ బానోతు జంకు నోట్లో గుడ్డలు కుక్కి ఓ గదిలో పడేశాడు. తర్వాత హిజ్రా రాధికను కత్తితో గొంతుకోసి చంపేందుకు యత్నించాడు. దీంతో ఆమె గొంతుపై, కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో నివసిస్తున్న శ్రావణి, భర్త కమల్‌ రాగా సురేష్‌ పరారయ్యాడు. ఈ ఘటనకు ధరావత్‌ సురేష్, అతడి అన్న నరి, తల్లి సాలీ, తండ్రి వీరన్న కారణమని హిజ్రా రాధిక అమ్మమ్మ బానోత్‌ జంకు పేర్కొంది. వెంటనే రాధికను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. మానుకోట టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడు సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ ఎస్‌.రవికుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top