సర్పంచిని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు | Sakshi
Sakshi News home page

సర్పంచిని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు

Published Thu, Jun 1 2017 1:16 AM

villagers attacked tree of the serpent attacked

ఐ.పోలవరం (ముమ్మిడివరం) : మండలంలోని టి.కొత్తపల్లి గ్రామ సర్పంచి వత్సవాయి రామకృష్ణంరాజు వికృత చేష్టలకు పాల్పడడంతో గ్రామస్తులు అతడిని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఆ గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం సర్పంచి మంగళవారం రాత్రి ఎదుర్లంక నుంచి టి.కొత్తపల్లి వచ్చేందుకు ఆటోలో వస్తుండగా పాత యింజరం సమీపంలో ఆటోను ఆపి డ్రైవర్‌ను దుర్భాషలాడి,  ‘బాహుబలి’ని అంటూ ఆటోను బోల్తా కొట్టించాడు. దీంతో భయపడిన ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడినుంచి మోటారు సైకిల్‌పై సీతమ్మ చెరువు సమీపంలో నిర్వహిస్తున్న జాతరలోకి వెళ్లి అక్కడ సినిమా వేస్తున్న స్క్రీన్‌ను చింపేశాడు.

అక్కడి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతడిని స్థానికులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ సర్పంచికి మతిస్థిమితం లేదంటూ గ్రామస్తులు అర్ధరాత్రి అక్కడి చెట్టుకు అతడిని కట్టేసి పోలీసులకు సమాచారం తెలియజేశారు. బుధవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సర్పంచిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై టి.క్రాంతికుమార్‌ మాట్లాడుతూ సర్పంచికి వైద్య పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాక గతంలో ఈ సర్పంచి.. పంచాయితీ కార్యదర్శిని చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement