జిల్లాలోని మన్యంకొండ పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతోంది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ మార్గంలో వెలసిన మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామికి ఈనెల 9 నుంచి 18వ తేది వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
జిల్లాలోని మన్యంకొండ పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతోంది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ మార్గంలో వెలసిన మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామికి ఈనెల 9 నుంచి 18వ తేది వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈనెల 14వ తేదీన జరుగనుంది. దీనికి గాను దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కొన్ని వేలాదిగా భక్తులు తరలివస్తారు.
న్యూస్లైన్, దేవరకద్ర రూరల్
తిరుమలకు...ఇక్కడికీ ఎన్నో పోలికలు...
తిరుపతికి, మన్యంకొండకు మధ్య అనేక పోలికలు ఉన్నాయని కథనం. అక్కడి వేంకటేశ్వరడుడు ఏడు కొండలపై వెలవగా, ఇక్కడ స్వామి మూడు కొండలపై వెలిశాడు. శేషసాయిగా తిరుపతిలోను, మన్యంకొండలో మాత్రమే వినుతికెక్కాడు. తిరుపతిలో ఏడు కొండలు దాటాల్సి వస్తే ఇక్కడ ఏడు ద్వారాలు దాటి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి. మన్యంకొండ క్షేత్రాన్ని రెండో తిరుపతిగా, తెలంగాణా తిరుపతిగా పిలుస్తుంటారు. ఈ క్షేత్రంలో వరాహస్వామి, శివాలయం, వీరభద్రస్వామి తదితర దేవాలయాలున్నాయి. అలాగే కోనేరు పక్కన గరుత్మంతుడి విగ్రహం భక్తులకు స్వాగతం పలికేలా కనిపిస్తుంది. దేవస్థానం గోడలపై పరుశరామ, రామ, కృష్ణ, బుద్ధా, కలికి అవతారం, వామన, నరసింహ, కూర్మ, వరాహ, మత్స్యవతారాల పెయింటింగ్స్ ఉన్నాయి. మన్యంకొండ పైనుంచి పరిసరాలను పరికిస్తే పచ్చని పంటచే లు చల్లటి గాలి భక్తులను ఆహ్లాదపరుస్తాయి.
విశేషోత్సవాలు...
ఈనెల 9 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు స్వామివారి సన్నిధిలో తిరుచ్చిసేవ నిర్వహించనున్నారు. అలాగే 10న సూర్యప్రభ వాహనసేవ, 11న శేషవాహనసేవ, 12న గజవాహనసేవ, 13న హన్మత్వాహనసేవ, 14న రథోత్సవం, గరుడ వాహనసేవ, 15న ఆశ్వవాహనసేవ, 16న వసంతోత్సవం, అవభృతస్నానం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఆళహరి నారాయణస్వామి, ఈఓ రాఘవేంద్రరావు తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.