పదో తరగతికి కొత్త పాఠ్యపుస్తకాలు
పదోతరగతి పాఠ్యపుస్తకాలు మారాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా వీటిని రూపొందించారని
నల్లజర్ల రూరల్, న్యూస్లైన్ : పదోతరగతి పాఠ్యపుస్తకాలు మారాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా వీటిని రూపొందించారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దేశ వ్యాప్తంగా ఒకే పాఠ్యప్రణాళిక ఉండేందుకు కృషి చేస్తున్నారు. రెండేళ్లుగా తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చడం ప్రారంభించి ఈఏడాదికి పూర్తి చేశారు. 15 ఏళ్ల తర్వాత మారిన పాఠ్యపుస్తకాలు ఆకర్షణీయంగా, రంగుల పేజీలు, ఛాయాచిత్రాలతో ఆకట్టుకునేలా ముద్రించారు. తెలుగు, ఆంగ్లం, గణితం, భౌతికరసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రం కొత్త పుస్తకాలు మండల విద్యావనరుల కేంద్రాలకు చేరాయి.
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు, శ్రమకు గుర్తింపు, స్త్రీల సాధికారిత వారిని గౌరవించడమెలా వంటి అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. తెలుగులో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు రచించిన నేనెరిగిన బూర్గుల పేరిట హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుపై వ్యాసం, శ్రమ విలువ గుర్తింపును ప్రస్తావిస్తూ బోయ భీమన్న రచించిన వ్యాసం, పరవస్తు చిన్నయసూరి, శ్రీనాథుడు తదితర కవుల రచనలు ఇందులో చేర్చినట్టు వివరించారు. ఉపవాచకంగా రామాయణంలో అంశాలును ఇచ్చారు. ఆంగ్లంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ పాఠాలను పొందుపరిచారు. వైకల్యంతో బాధపడుతున్నా అకుంఠిత దీక్షతో కృషి చేసి ఉన్నతి స్థాయికి ఎదిగిన శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్, కళాకారిణులు హెలెన్ కిల్లర్, సుధాచంద్రన్ల వ్యాసాలున్నాయి. అంతేకాకుండా తెలుగు చలనచిత్రం మాయాబజార్పై ప్రత్యేక పాఠం, నాటకరంగం తదితర అంశాలపై ఛాయా చిత్రాలతో ఆకట్టుకునేలా రూపుదిద్దారు. వేసవి సెలవుల అనంతరం ఈపుస్తకాలు పాఠశాలలకు చేరనున్నాయి.