విభజనపై పోలీసుల అంతర్మథనం! | Antarmathanam partition the police! | Sakshi
Sakshi News home page

విభజనపై పోలీసుల అంతర్మథనం!

Nov 12 2014 1:28 AM | Updated on Aug 21 2018 5:46 PM

విభజనపై పోలీసుల అంతర్మథనం! - Sakshi

విభజనపై పోలీసుల అంతర్మథనం!

గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పోలీసుల విభజన ప్రక్రియ మళ్లీ తెరపైకి రావడంతో సిబ్బందిలో గందరగోళం నెలకొంది.

గుంటూరు క్రైం: గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పోలీసుల విభజన ప్రక్రియ మళ్లీ తెరపైకి రావడంతో సిబ్బందిలో గందరగోళం నెలకొంది. గత ఏడాది విడుదల చేసిన విభజన జాబితాను సోమవారం మళ్ళీ పోలీస్ ఇంట్రానెట్‌లో ఉంచడం చర్చనీయాంశంగ మారింది. దీనిపై సిబ్బంది అంతర్మథనం చెందుతున్నారు. సీనియారిటీ ఆధారంగా రూపొంది అప్పటి డీజీపీ ఆమోదం పొందిన జాబితాను ఎలాగైనా అమలు పరచాలనే తలంపుతో అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ ఉన్నట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు.

జాబితా తప్పుల తడకగా ఉందని.. కొత్త జాబితా రూపొందించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా విభజన చేస్తే సమస్యలు ఉండవని కొందరు, తొలుత సిబ్బంది అభిప్రాయాలు, విజ్ఞప్తులను ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని చేస్తే సమస్యలు ఉండవని మరికొందరు అంటున్నారు. తాజా సమాచారం తెలియటంతో పలువురు సిబ్బంది మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని చర్చించుకున్నారు.  

విద్యా సంవత్సరం మధ్యలో అర్బన్ జిల్లాలో పనిచేస్తున్న 90 మందిని బదిలీ చేయటం వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని వాపోయూరు. ఇప్పుడు మళ్లీ బదిలీ చేస్తే ఎలాగని అన్నారు. ఈ నేపథ్యంలో రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్‌ను రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ.రామకృష్ణ కలసి విభజన విషయమై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, డీజీపీ ఆమోదం పొందిన జాబితాను అమలు పరిచేందుకు అర్బన్ ఎస్పీ తదుపరి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

2011లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల సిబ్బంది విభజనను అమలు చేసిన అనుభవం ఉన్న ఎస్పీ రాజేష్‌కుమార్ ఎలాంటి వత్తిళ్ళు వచ్చినప్పటికీ పని పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. మరో నాలుగైదు రోజుల్లో డ్యూటీ ఆర్డర్(డీఓ)లు వెలువడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement