చర్చోప చర్చలు! | all have tension on telangana bill | Sakshi
Sakshi News home page

చర్చోప చర్చలు!

Feb 6 2014 3:19 AM | Updated on Jul 29 2019 5:28 PM

రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ బిల్లుపై ఢిల్లీలో హడావుడి మొదలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ బిల్లుపై ఢిల్లీలో హడావుడి మొదలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యూపీఏ ప్రభుత్వం చివరి పార్లమెంటు సమావేశాలు బుధవారం ప్రారంభం కావడం.. ఈ సమావేశాల్లోనే ‘టీ’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా హస్తినలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

 తెలంగాణ బిల్లుపై తె లంగాణ, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు పోటాపోటీగా దేశ రాజధాని ఢిల్లీలో మోహరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు జంతర్ మంతర్‌లో మౌనదీక్ష చేయడం.. సీఎం
 దీక్షకు కౌంటర్‌గా తెలంగాణ ప్రతినిధులు కూడా ఆందోళనకు దిగడంతో మారుతున్న సమీకరణలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

 ఈ క్రమంలో బుధవారం టీవీలకు అతుక్కుపోయిన ప్రజలు, వివిధ పార్టీల శ్రేణులు ఢిల్లీ పరిణామాలను ఆసక్తిగా వీక్షించారు. అసలేం జరుగుతోంది.. బిల్లు ప్రవేశపెడతారా? బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే అంశాలపై చర్చోపచర్చలు సాగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహా జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు కేఎల్లార్, బండారి రాజిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సైతం హస్తినలోనే ఉన్నారు.

మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి బుధవారం న గరానికి చేరుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ‘టీ’ బిల్లుపై  క్షణక్షణం చోటుచేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించుకునే పనిలో రాజకీయనేతలు నిమగ్నమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement