వేలూరు: వృద్ధులతో ప్రేమగా మాట్లాడుతూ వైద్య సేవలు చేయాలని కలెక్టర్ లీల అలెక్స్ అన్నారు. ప్రపంచ వృద్ధులపై దాడుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు పెడ్ల్యాండ్ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ ఆసుపత్రి డీన్ రోహిణీదేవి అధ్యక్షతన జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్లు, నర్సిగ్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మనం పెరిగి పెద్దవారు కావడానికి మన తల్లిదండ్రులు, మన పూర్వీకులే కారణమని మన పెద్దలు లేకుంటే క్రమశిక్షణతో పెరిగి ఉండే వారం కాదని గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం వృద్ధులు అధికంగా పలు రోగాల బారిన పడి ఆసుపత్రికి వస్తుంటారని వారిని చులకనగా చూడకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్య సేవలు చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది వృద్ధులను ఇంటిలో ఉంచుకోకుండా వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారని, దీన్ని మానుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ వేలూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా విన్నపాల దినోత్సవంలో కలుసుకొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో కొన్ని సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగా మరిన్ని సమస్యలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రీవెన్స్ సెల్లో వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.


