దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి ప్రమోషన్స్లో బిజీ అయిపోయాడు. వచ్చే ఏడాదిలో విడుదలయ్యే ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టాడు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ని మెక్సికోలో జరుగుతోన్న ‘కామిక్కాన్ ఎక్స్పీరియన్స్ - 2026’లో ప్రదర్శించారు. ఈసందర్భంగా రాజమౌళి వీడియో ద్వారా అక్కడి ప్రేక్షకులకు సందేశమిచ్చారు.
‘నాకు మెక్సికో అంటే చాలా ఇష్టం. నేను తెరకెక్కించిన బాహుబలి మూవీలో కూడా సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇట్జా(మెక్సికోలో ఒక నగరం) స్ఫూర్తిగా తీసుకున్నా. గత 25 ఏళ్లుగా నేను సినిమా రంగంలోనే ఉన్నాను.ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాను. మనం తెరకెక్కించిన చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచమంతా ఆదరించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. నాటు నాటు పాటకు ప్రపంచం అంతా స్టెప్పులేస్తుంటే.. అది చూసి చాలా సార్లు ఎమోషనల్ అయ్యాను. అప్పుడే నేను సినిమాలు ఎందుకు చేస్తున్నానో అర్థమైంది. వీలైనంత వరకు ప్రపంచం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను’ అని రాజమౌళి అన్నారు.
వారణాసి విషయానికొస్తే.. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ఇది. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు.కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.


