దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు
ష్రీవ్పోర్ట్: అమెరికాలోని లూసియానాలో దారుణం చోటుచేసుకుంది. ఫ్రీవ్పోర్ట్ నగరంలో ఓ ఉన్మాది విచ్చలవిడిగా కాల్పులకు తెగబడి ఏకంగా 8 మంది చిన్నారులను పొట్టన పెట్టుకున్నాడు. మూడుచోట్ల అతడు ఈ ఉన్మాద చర్యకు దిగాడు. కాల్పుల్లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు.
దుండగుడు శనివారం రాత్రి వెస్ట్ 79 స్ట్రీట్లోని రెండిళ్లలో, సమీపంలోని హారిస్ స్ట్రీట్లోని మరో ఇంట్లో ఈ దారుణాలకు ఒడిగట్టాడు. కాల్పులకు బరైన చిన్నారుల్లో అతని సంతానం కూడా ఉన్నట్లు చెబుతున్నారు! మరణించిన చిన్నారులంతా 1 నుంచి 14 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దొంగిలించిన కారులో పారిపోతున్న నిందితుడిని పోలీసులు వెంటాడారు. ఈ సందర్భంగా వారు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని ష్రీవ్పోర్ట్ పోలీసు చీఫ్ వేన్ స్మిత్ తెలిపారు.
అయోవా వర్సిటీ వద్ద కాల్పులు
అయోవా యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. బార్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అది కాల్పులకు దారి తీసింది. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని సమాచారం. ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.


