పశ్చిమాసియా పరిస్థితులు కీలకం
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఎఫెక్ట్
చమురు ధరలు, రూపాయికీ ప్రాధాన్యం
ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే
దేశీ మార్కెట్ ట్రెండ్పై విశ్లేషకులు
అటు హార్మూజ్పై వివాదాలు, ఇటు ముడిచమురు ధరలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, దేశీ కార్పొరేట్ క్యూ4 ఫలితాలకు ఇన్వెస్టర్లు అత్యధిక ప్రాధాన్యత వచ్చే వీలుంది. వెరసి ఈ వారం సైతం తీవ్ర ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..
పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. మరోపక్క ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్ మరింత వేడెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలిచే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) పాలసీ సమీక్ష నిర్ణయాలు కీలకంగా నిలవనున్నాయి. వెరసి పలు అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మే 1) స్టాక్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.
ఐఐపీ..
గత వారాంతాన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, వరుణ్ బెవరేజెస్, ఏయూ స్మాల్బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, అదానీ టోటల్, మారుతీ సుజుకీ, ఎటర్నల్, గార్డెన్రీచ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పవర్, ఇండియన్ బ్యాంక్, వారీ ఎనర్జీస్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, చోళమండలం తదితరాల పనితీరు వెల్లడికానుంది. మార్చి నెలకు రేపు(28న) పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ 5.2 శాతం వృద్ధిని సాధించింది.
ఇతర అంశాలు
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల ఎగువకు చేరాయి. డాలరుతో మారకంలో రూపాయి 93.5కు బలహీనపడింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో భారీఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరగనుంది. దీంతో ఆర్బీఐ కఠిన విధానాలకు తెరతీయవలసి ఉంటుందని ఆరి్ధకవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా వివాదాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు తెలియజేశారు.
సాంకేతికంగా చూస్తే
ప్రధానంగా ఐటీ రంగం 10 శాతం పతనంకావడంతో గత వారం మార్కెట్లు క్షీణించాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 23,650–23,500 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇక్కడ బలపడితే.. 24,700వరకూ పురోగమించే అవకాశముంది. ఇక సెన్సెక్స్ 76,000–75,600 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 77,300ను అధిగమించే వీలుంది. ఆపై 78,000 పాయింట్లను దాటవచ్చు. దిగువస్థాయిల్లో 75,000 వద్ద రికవరీకి వీలుంది.
చమురు షాక్
గత వారం ముడిచమురు ధరలు 8–10 శాతం ఎగశాయి. దీనికితోడు ఐటీ దిగ్గజాలు నిరుత్సాహపరచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగాయి. వెరసి గత వారం(20–24) నికరంగా సెన్సెక్స్ 1,829 పాయింట్లు(2.3 శాతం) పతనమైంది. 76,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 456 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి 23,898 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ స్వల్పంగా 0.6–0.2 శాతం మధ్య నీరసించాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్


