రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ పాటలు వినే అలవాటు మీకు ఉందా? అయితే ఇకపై మీ పద్ధతి మార్చుకోవాల్సిందే. లేదంటే మీరు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణికుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు.. క్వైట్ అవర్స్
రైల్వే శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కింది నిబంధనలు అమల్లో ఉంటాయి.
మొబైల్ ఫోన్లలో పాటలు వినాలన్నా లేదా వీడియోలు చూడాలన్నా కచ్చితంగా ఇయర్ఫోన్స్ లేదా హెడ్ఫోన్స్ వాడాలి. లౌడ్ స్పీకర్ ఆన్ చేయడం నిషిద్ధం.
ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కవారికి ఇబ్బంది కలగకుండా తక్కువ స్వరంతో మాట్లాడాలి. గట్టిగా అరుస్తూ మాట్లాడితే రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.
వ్యక్తిగత బెర్త్ లైట్లు మినహా కోచ్లోని మిగిలిన అన్ని లైట్లు ఆపివేయాలి. తద్వారా తోటి ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా చూడాలి.
ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు
ఈ నిబంధనలు రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణించే అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే బాధిత ప్రయాణికులు వెంటనే రైలులో అందుబాటులో ఉండే ఆర్పీఎస్ఎఫ్/ ఆర్పీఎఫ్ సిబ్బందికి లేదా టికెట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ‘ప్రయాణికుల ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలి. నిబంధనలు అతిక్రమించే వారిపై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు’ అని రైల్వే ఉన్నతాధికారుల ప్రకటనలో తెలిపారు.
రైలు ప్రయాణాన్ని సుఖమయం చేయడంలో తోటి ప్రయాణికుల సహకారం ఎంతో అవసరం. కాబట్టి ప్రయాణికులు ఈ నియమాలను పాటించి చిక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించాలని రైల్వే శాఖ కోరుతోంది. రాబోయే రోజుల్లో ఈ నిబంధనల అమలుపై మరింత నిఘా పెంచనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!


