ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.
ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి.


