ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) బ్యాంకుల నుంచి నిధుల సమీకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) మరింత పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. బ్యాంకుల్లో రుణ రేట్లు తక్కువగా ఉండడమే కారణమని పేర్కొంది.
ఎన్బీఎఫ్సీ నిధుల సమీకరణలో బ్యాంకుల వాటా 2026 మార్చి నాటికి 43 శాతానికి చేరిందని, 2027 మార్చి నాటికి 45 శాతానికి పెరగొచ్చని తెలిపింది. 2025–26 మొదటి ఆరు నెల్లలో క్యాపిటల్ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లపై నిధుల సమీకరణకు ఎన్బీఎఫ్సీలు మొగ్గు చూపించగా, తదుపరి ఆరు నెలల్లో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంకుల వైపు మొగ్గు చూపించినట్టు వివరించింది.
‘‘బ్యాంకు రుణ రేట్లు గత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. బాండ్ ఈల్డ్స్ మాత్రం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తగ్గగా, తర్వాతి కాలంలో మళ్లీ పెరగడం మొదలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కరెన్సీ మారకం విలువల్లో అనిశ్చితుల ఫలితంగా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) జారీ వాటా కూడా సమీప కాలంలో స్దబ్దుగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీల నిధుల సమీకరణకు సెక్యూరిటైజేషన్ (చెల్లింపుల్లేని రుణాలను విక్రయించడం) కొంత మద్దతునివ్వొచ్చు. స్థూల ఆర్థిక అనిశి్చతుల నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్లు), కార్పొరేట్ బాండ్ ఈల్డ్స్ సమీప కాలంలో గరిష్టాల్లోనే ఉండొచ్చు. కార్పొరేట్ బాండ్ వడ్డీ రేట్లు బ్యాంక్ రుణ రేట్ల కంటే అధికంగానే కొనసాగొచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది.


