అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య యద్దనపూడి: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రత్నకుమారి వివరాల మేరకు.. అనంతవరం గ్రామానికి చెందిన బొబ్బేపల్లి శ్రీనివాసరావు (52) గత 26 ఏళ్లుగా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఇసీ్త్ర బండి పెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడు శ్రీనివాసరావు కుటుంబ అవసరాల కొరకు తెలిసిన వారి వద్ద నుండి రూ.20 లక్షలకు పైగా అప్పు చేయటంతో తిరిగి అప్పులు చెల్లించలేక మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం తన స్వగ్రామం అనంతవరం వచ్చి తన తండ్రి నివాసం ఉంటున్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుని భార్య సామ్రాజ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

నిందితుడికి మూడేళ్ల జైలు

గుంటూరు లీగల్‌: నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్‌కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ టి.దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్‌ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది.

ఏపీఎం సోమశేఖర్‌కు రిమాండ్‌

కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్‌ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్‌ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్‌, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్‌ బెయిల్‌ బుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement