borrowings
-
అప్పుల్లో టాప్ రాష్ట్రం ఇదే..
దేశంలోని రాష్ట్రాల్లో ఏటికేడు అప్పులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో తమకు ఉపయోగపడేలా స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు అప్పులను వాడుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికోసం వీటిని వినియోగిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య మొత్తం తమిళనాడు రుణాలు రూ.1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.బలమైన ఆర్థిక వ్యూహం, వృద్ధి ఆధారిత పెట్టుబడుల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తూ తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులను సమీకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అప్పుల్లో తమిళనాడు నిలకడగా ముందంజలో ఉంది. సంవత్సరాలవారీగా అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరంలో రూ.87,977 కోట్లు2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో రూ.87,000 కోట్లు2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు రూ.1.01 లక్షల కోట్లుతమిళనాడు తర్వాత 2025 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర రూ.99,000 కోట్ల అప్పుతో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..అప్పులకు వెనుక కారణాలు2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయంలో 22% పెరుగుదలను రాష్ట్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 28.7% లోపు దాని డెట్-జీఎస్డీపీ నిష్పత్తి 26.43%గా ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వం, సుస్థిరతను నిర్ధారిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమిళనాడు రూ.20,000 కోట్ల రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. దాంతో మొత్తం రుణాలు రూ.1.62 లక్షల కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. -
కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్–డిసెంబర్) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్ డెట్ (బాండ్లు, సెక్యూరిటీల రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది. ‘‘మధ్యంతర బడ్జెట్లో అంచనాలకంటే తక్కువ రుణ సమీకరణ ప్రతిపాదనలు, జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి పరిమితం చేయడం, 2025–26 నాటికి 4.5 శాతానికి తగ్గించే చర్యలను ప్రకటించడంతో దేశీ బాండ్ ఈల్డ్ మార్చి త్రైమాసికంలో నెమ్మదించాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, స్థిరమైన ద్రవ్యోల్బణం కూడా ఇందుకు సహకరించాయి’’అని ఆర్థిక శాఖ వివరించింది. మరోవైపు ఇదే కాలంలో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.33 శాతం గరిష్ట స్థాయిని తాకినట్టు గుర్తు చేసింది. ద్రవ్యలోటు 3 శాతమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే చివరి నాటికి ద్రవ్యలోటు మొత్తం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలో 3 శాతంగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల (ఏప్రిల్, మే) కాలంలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడం తెలిసిందే. సాధారణంగా ప్రవర్తనా నియామావళి అమల్లో ఉన్న కాలంలో కొత్త ప్రాజెక్టులపై వ్యయాలకు కేంద్రం దూరంగా ఉంటుంది. ఇదే ద్రవ్యలోటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల కాలంలో ద్రవ్యలోటు మొత్తం ఏడాదికి బడ్జెట్ అంచనాల్లో 11.8 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య అంతరాన్నే ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో ద్రవ్యలోటు 5.1 శాతంగా (రూ.16,85,494 కోట్లు) ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా. మే చివరికి ద్రవ్యలోటు రూ.50,615 కోట్లుగా ఉన్నట్టు సీజీఏ తెలిపింది. ఇక మొదటి రెండు నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.3.19 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పన్నుల ఆదాయం లక్ష్యంలో ఇది 12.3 శాతానికి సమానమని పేర్కొంది. మొత్తం వ్యయాలు ఏప్రిల్, మే చివరికి రూ.6.23 లక్షల కోట్లుగా ఉండగా, బడ్జెట్ అంచనాల్లో ఇది 13.1 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతంగా ఉండడం గమనార్హం. -
భారత్ భారీ రుణ సేకరణ..! రాయిటర్స్ పోల్లో కీలక అంశాలు!
ఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అంతేకాదు.. ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో.. సెంట్రల్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో.. దేశ ఆర్థిక వృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టిసారించిన మోదీ ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. కరోనా సమయంలో మందగించిన ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడంతో పాటు.. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 198 బిలియన్ డాలర్ల రుణాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు రాయిటర్స్ ఆర్థికవేత్తల పోల్ సర్వే వెల్లడిస్తోంది. పన్ను రాబడిలో పతనం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి మందగించడం వల్ల సమీప కాలంలో రుణ సామర్థ్యాన్ని పరిమితం చేయాలన్న యోచనలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14.2 ట్రిలియన్ రూపాయులుగా ఉన్న స్థూల రుణ పరిమితి ఈసారి 16 ట్రిలియన్ రూపాయలకు చేరనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కాగా.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 2014లో దేశ స్థూల రుణం 5.92 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. మరోవైపు.. 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీలో బడ్జెట్ లోటును 6 శాతానికి తగ్గించగలదని రాయిటర్స్ కు చెందిన మరో ఆర్థికవేత్తల పోలింగ్ నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటికీ 1970ల నుంచి చూసిన సగటు 4% నుండి 5% కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2025-26 నాటికి 4.5 శాతానికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రికార్డు స్థాయిలో 8.85 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని, ఇది జీడీపీలో 2.95 శాతమని రాయిటర్స్ పోల్ నివేదిక చెబుతోంది. అయితే.. ప్రపంచ తయారీ రంగంలో చైనాను అధిగమించి భారత్ అగ్రగామిగా నిలవాలంటే.. మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని సూచించింది. -
రైతులకు బేడీలు.. కార్పొరేట్లకు మాఫీలు
మన దేశంలో అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపిస్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమానులను జైళ్ల పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనలతో ఇలాంటి పెద్ద మనుషులను కాపాడుతున్నారు. మరి రైతులకు కూడా ఈ హెయిర్కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వాలి కదా! పంజాబ్లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేక మంది రైతులకు రుణమాఫీ నిరాకరించారు. రుణ విధానానికి రెండు ముఖాలుంటాయి. ధనికు లకు ఓ రకంగా, పేదలకు మరో విధంగా బ్యాంకులు రుణాలిచ్చే విషయంలో వ్యవహరిస్తుంటాయి. పంజాబ్ వ్యవసాయ అభి వృద్ధి బ్యాంక్ వ్యవహారాన్నే తీసుకుందాం. రుణా లుగా తీసుకున్న రూ. 229.80 కోట్ల బకాయిలను ఒకే సారి తిరిగి చెల్లించకపోతే రైతుల పొలాలను అమ్మి వేస్తామని బెదిరిస్తూ వారికి ఈ బ్యాంక్ లీగల్ నోటీసులిచ్చింది. మరో పక్క, రుణం ఎగ్గొట్టే స్థితికి చేరిన ఆధునిక్ మెటాలిక్స్ లిమిటెడ్(ఏఎంఎల్) అనే కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోల్కత్తా శాఖ భారీ స్థాయిలో వెసులుబాటు కల్పించింది. ఈ కంపెనీ బకాయి మొత్తంలో 92 శాతం మాఫీ చేసింది. అంటే రుణంలో 8 శాతం చెల్లించి చేతులు దులు పుకునే అవకాశం ఈ కంపెనీకి ఇచ్చింది. రుణాల వసూలులో ఇలాంటి ‘రాయితీ’ని బ్యాకింగ్ పరి భాషలో ‘హెయిర్కట్’(క్షౌరం) అంటారు. కిందటి వారం ఇలాంటిదే జరిగింది. మానెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ అనే కంపెనీకి తన రుణ బకా యిల చెల్లింపులో 78 శాతం మాఫీ(హెయిర్కట్) లభించింది. ఈ కంపెనీ రుణ బకాయిల మొత్తం రూ.11,014 కోట్లు. రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా ఈ కంపెనీపై వేసిన ఖాయిలా ప్రక్రియ విచారణ పూర్తయ్యాక ఇంతటి భారీ రాయితీ కల్పిం చారు. ఈ నిర్ణయం వల్ల ఈ కంపెనీ తనకు అప్పి చ్చిన సంస్థలకు కేవలం రూ.2,457 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.8,557 కోట్లను మొండి బాకీ కింద మాఫీ చేస్తారు. రుణాలు ఎగవేసే వ్యాపా రుల విషయంలో ఇంతటి ‘పెద్ద మనసు’తో వ్యవహ రించడం వల్లే అప్పులు చెల్లించని కంపెనీల యజ మానుల జీవన శైలి మారడం లేదు. రైతులకు ఇలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో వారు చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు ఇలాగే ఉంటోంది. పరిశ్రమలు చెల్లించాల్సిన బకాయిల మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని మాఫీ చేయడానికే ప్రతి అవకాశాన్ని బ్యాంకులు వాడుకుంటున్నాయి. పైన చెప్పిన ఏఎంఎల్ కంపెనీ విషయానికి వస్తే, ఇంగ్లండ్కు చెందిన లిబర్టీ హౌస్తో రూ.410 కోట్లకు ఒప్పందం కుదిరిన తర్వాత ఖాయిలా పరిశ్రమలకు వర్తించే రుణగ్రస్తత, దివాలా నిబంధనల కింద (ఐబీసీ) ఈ కంపెనీకి 92 శాతం అంటే రూ. 4.960 కోట్ల భారీ ‘హెయిర్కట్’ మాఫీ లభించింది. ‘ఖాయిలా’ ముద్రతో రుణాల ఎగవేత! మళ్లీ పంజాబ్ రైతుల రుణాల విషయానికి వస్తే– 12,625 మంది రైతుల రుణాల బకాయిల మొత్తం రూ.229.80 కోట్లను పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు వసూలు చేయడానికి ఎలాంటి పద్ధతి అవ లంబిస్తోందో చూడండి. ఓ భారీ పారిశ్రామిక కంపె నీకి మాఫీ చేసిన మొత్తంలో ఇది చాలా మొత్తం. ఓ కంపెనీ ఖాయిలా పడిందని ప్రకటించాక రుణ చెల్లింపు పరిష్కార ఒప్పందం కింద ఇంతటి భారీ రాయితీని మాఫీ రూపంలో బ్యాంకులు అందిస్తు న్నాయి. వాస్తవానికి అప్పును మాఫీ చేయడం కన్నా ఎక్కువగా కంపెనీలకు మేలు చేయడానికి ఆడుతున్న నాటకమే దివాలా తీసినట్టు ప్రకటించడం. దీనికి ఖాయిలాపడటమనే మాట వాడుతున్నారు. రుణం తీసుకున్నాక కంపెనీ యజమాని దాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా తెలివిగా నష్టాలతో నడిచే తన కంపెనీని అమ్మేసి స్వేచ్ఛగా తిరుగుతు న్నాడు. అంటే దాదాపు రుణం మొత్తాన్ని పన్నులు చెల్లించే ప్రజలే చివరికి భరిస్తున్నారు. ఈ తరహా వ్యవహారానికి ప్రఖ్యాత అమెరికా మేధావి నోమ్ చామ్స్కీ ‘కటువు ప్రేమ’ అని పేరు పెట్టారు. అంటే ఇది పేదలకు భారంగా, ధనికులకు ప్రేమగా పరిణమిస్తుంది. కార్పొరేట్ కంపెనీల రుణా లను మాఫీచేయడం ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే నిజమైతే, రైతుల రుణాల మాఫీ ఆర్థికాభివృద్ధికి ఎందుకు దారితీయదో నాకు అర్థంకావడం లేదు. నిజానికి, రైతులు, పారిశ్రామిక కంపెనీలు ఒకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. మరి అలాంటప్పుడు కార్పొరేట్ మొండి బాకీల మాఫీ ఆర్థికాభివృద్ధికి దారితీస్తే, వ్యవసాయ రుణాల రద్దు నైతికపరమైన ప్రమాదానికి ఎందుకు కారణమౌ తుంది? రుణాల మాఫీ కోరే రైతులను ఎందుకు ఏహ్యభావంతో చూస్తున్నారు? రుణాల చెల్లింపులో అరాచకానికి రైతుల అప్పుల మాఫీయే కారణమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్పర్సన్ గతంలో నిష్టూరంగా మాట్లాడారు. అలాగే, వ్యవసాయ రుణాల మాఫీ నైతికపరమైన ముప్పుగా మారిందని, దీనివల్ల జాతీయ ఆదాయ, వ్యయాల పట్టిక తలకిందులవు తోందని భారతీయ రిజర్వ్బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. రుణాలు చెల్లించని 12,625 మంది రైతుల వ్యవసాయ భూములను బహిరంగ వేలం వేసే ఉద్దేశం నిజంగా తనకు లేదని, లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమేనని పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ప్రకటించింది. అయితే, రూ.1363.87 కోట్ల రుణాలను బ్యాంకుకు తిరిగి చెల్లించని 71,432 మంది రైతులపై కత్తి వేళ్లా డుతూనే ఉంది. హరియాణాలో సాగునీటి పైప్లైన్ వేయడానికి ఆరు లక్షల రూపాయల రుణం తీసు కున్న ఓ రైతు అప్పు కట్టలేకపోయాడు. అందుకు ఫలితంగా అతను రూ.9.83 లక్షల జరిమానా చెల్లిం చాలని, రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పరిశ్రమలకు భారీ రాయితీ కోట్లాది రూపాయల రుణ బకాయిలు వసూలు చేసే సామర్ధ్యం లేకనే పైన ఉదహరించిన ఏఎంఎల్ కంపె నీకి భారీ రాయితీ (హెయిర్ కట్) కల్పించారు. సినర్జీస్ డోరే ఆటోమేటివ్ లిమిటెడ్ కంపెనీకి 94.27 శాతం భారీ రుణమాఫీ ఇవ్వడంతో దీని నుంచి ఆర్థిక సంస్థలు కేవలం రూ. 54 కోట్లు మాత్రమే వసూలు చేస్తాయన్న మాట. వాస్తవానికి ఈ కంపెనీ మొత్తం రుణ బకాయిలు రూ.972.15 కోట్లు అంటే ఏ స్థాయిలో అప్పులు ఎగవేసే అవకాశం దీనికి లభిం చిందో ఊహించుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకుండా మొండి బాకీలుగా మారిపోయే పరిస్థితులు తలెత్తిన సంద ర్భాల్లో ఈ అప్పులు కట్టడానికి వాటికి తగిన వెసు లుబాటు కల్పించేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంతో కొంత మొత్తం రుణం కింద చెల్లించడానికి వీలుగా ఈ కంపెనీలకు ‘హెయిర్ కట్’లు ఇస్తున్నారు. ఇలాంటి కంపెనీల రుణాల వసూలుకు 2004లో ‘స్ట్రెస్డ్ అసెట్ స్టెబి లైజేషన్ ఫండ్’ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ ఇలాంటి మొండి బకాయిలను వసూలు చేయడానికి కొన్ని కంపెనీ లకు 90 శాతానికి పైగా ‘హెయిర్కట్లు’ ఇచ్చింది. స్థిరీకరణ నిధి పేరుతో ఉన్న ఈ సంస్థ అందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్లకు జైలు శిక్షలుండవు అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపి స్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమా నులను జైలుకు పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనావళి ఈ పెద్ద మనుషులను కాపాడుతోంది. మరి రైతులకు కూడా ఈ హెయిర్ కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులబాటు ఇవ్వాలి కదా! పెద్దగా నష్టపోకుండా అప్పుల ఊబి నుంచి బయటపడటానికి రైతులకు కూడా అవకాశాలు కల్పించాలి. పంజాబ్లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రక టించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేకమంది రైతులకు రుణమాఫీ ప్రయో జనం నిరాకరించారు. ఇది నిజంగా అన్యాయం. మాఫీ చేసే మొత్తానికి ఇలా గరిష్ట పరిమితి విధిస్తూ ఆర్థిక న్యాయం కొందరికే పరిమితం చేస్తు న్నారు. ఈ సందర్భంగా రైతుల రుణభారం తగ్గించడానికి కేర ళలో 2007లో ఏర్పాటు చేసిన కేరళ స్టేట్ డెట్ రిలీఫ్ కమిషన్ ఎలా పనిచేస్తోందో తెలుసు కుంటే మంచిది. రైతుల వ్యవసాయ రుణాల పాత బకాయిలను సగ టున 50 నుంచి 75 శాతం వరకూ మాఫీ చేసిందని ఈ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా వ్యవ సాయదారులు పాత అప్పులను వదిలించుకుని తాజాగా రుణాలు తీసుకోవడానికి వీలవుతోంది. రైతులు పేదవారు కాబట్టి వారికి ఆర్థిక స్వాతం త్య్రాన్ని నిరాకరించకూడదు. రైతన్నలను నిరంతర రుణభారం నుంచి విముక్తిచేయాల్సిన అవసరం ఉంది. భిన్న వర్గాలకు భిన్న రీతుల్లో రుణ విధానం అమలు చేయడం సబబు కాదు. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
మెదక్(తూప్రాన్): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో ఆకుల వెంకటేశ్(32) అనే రైతు అప్పుల బాధతాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణమిత్రుల్ని కడతేర్చిన అప్పులు
చాట్రాయి(కృష్ణా): ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులు వారి పాలిట యమపాశాలయ్యాయి. చివరికి ఇద్దరూ కలిసే చనిపోయారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండల కేంద్రంలో జరిగిన ఈఘటనపై మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలివీ.. చాట్రాయికి చెందిన లోకాల మధు (36), కర్రెడ్ల పుల్లారావు(35) ప్రాణ స్నేహితులు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న మధుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటున్న పుల్లారావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ అవసరాల రీత్యా అధిక వడ్డీకి కొంత రుణం తీసుకున్నారు. సకాలంలో తీర్చలేకపోవటంతో రుణదాతలు ఒత్తిడి చేశారు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన స్నేహితులిద్దరూ సోమవారం రాత్రి ఊరికెళుతున్నామని కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి నుంచి వచ్చారు. ఇద్దరూ స్థానిక శివాలయం వద్ద ఉన్న బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం బావిలో ఉన్న మృతదేహాలను స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో బావిలో పడి చనిపోయి ఉండవచ్చుననే ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మహబూబ్నగర్(అచ్చంపేట): అచ్చంపేట మండలం రంగాపూర్లో అప్పులబాధ తట్టుకోలేక కౌకుంట్ల సుదర్శన్ రెడ్డి(45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో చూసి పొలం వద్ద ఉన్న ఇంట్లో మంగళవారం ఉరేసుకున్నాడు. ఇటీవల వేసిన పత్తి, మొక్కజొన్న పంటల్లో నష్టం రావటంతో మనస్తాపానికి గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.5 లక్షల మేర అప్పులు పేరుకు పోవడంతో గత్యంతరం లేక ఉరేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.