పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తాం-హోంమంత్రి | All police stations to be connected, says Home minister | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తాం-హోంమంత్రి

Mar 22 2015 10:53 PM | Updated on Sep 2 2017 11:14 PM

పోలీస్‌శాఖలో కమ్యూనికేషన్ విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానం చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూం..

మంథని (కరీంనగర్ జిల్లా): పోలీస్‌శాఖలో కమ్యూనికేషన్ విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానం చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్, ముత్తారంలలో ఒక్కొక్కటి రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్ నూతన భవనాలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్‌శాఖకు గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అత్యాధునిక కమ్యూనికేషన్ విధానాన్ని అముల్లోకి తీసుకువచ్చేందుకు రూ.20 కోట్లతో హైదరాబాద్‌లో 22 అంతస్తుల భవనం నిర్మిస్తామన్నారు.

ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. ఏ ఏ ఠాణాలో ఏం జరుగుతుందో తెలుసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రేడ్‌లను బట్టి ఆయూ పోలీస్‌స్టేషన్లకు నెలవారీగా నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామన్నారు. ఆడపడుచుల రక్షణకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందించేందుకే ఉద్యోగులకు భారీగా పీఆర్సీ అందించామన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరినీ లంచం అడగొద్దని, అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని హోంమంత్రి తెలిపారు. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న ఆయన గోదావరి పుష్కరఘాట్‌ను పరిశీలించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనునన తొలి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో నిర్వహిస్తామన్నారు. పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం వస్తారని చెప్పారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ పోలీసులు ప్రజా పోలీసులుగా మారాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement