
త్రిష పై నెటిజన్ల ఆగ్రహం
చెన్నై సుందరి త్రిష నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈమె మూగజీవాల ప్రేమికురాలన్న విషయం తెలిసిందే.
చెన్నై సుందరి త్రిష నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈమె మూగజీవాల ప్రేమికురాలన్న విషయం తెలిసిందే. అలాంటి మూగ ప్రాణుల సంరక్షణ సంస్థ పేటాకు తన వంతు సేవలను అందిస్తున్న త్రిష దీనికి ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ మూగ జీవి బాధింపునకు గురైనా వెంటనే స్పందిస్తుంటారు. అదే విధంగా ఇటీవల ఉత్తరాఖండ్లో రాజకీయ వాదుల గొడవల్లో ఒక గుర్రం తీవ్రంగా గాయపడింది.
కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ శాసన సభ్యుడు ముసోరి గణేశ్ జోషీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దాన్ని అడ్డుకున్న పోలీసులు గుర్రాలపై వచ్చారు. ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ శాసన సభ్యుడు ముసోరి గణేశ్ జోషి పోలీసు నుంచి లాఠి లాక్కుని గుర్రాన్ని చితక బాదారు. ఆ సంఘటన దృశ్యాలు మీడియాలో హల్చల్ చేశాయి. అవి చూసిన నటి త్రిష తీవ్రంగా స్పందించారు. గుర్రాన్ని రక్తం కళ్ల చూసిన ఆ శాసన సభ్యుడిని ఉద్దేశిస్తూ మిమ్మల్ని నరకంలో కాల్చాలి అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
దీనికి కొందరు త్రిషకు మద్దతు పలికినా మరి కొందరు ఆరోపణలు గుప్పించడం గమనార్హం. గుర్రం కాలికి తగిలిన దెబ్బలపై స్పందించిన త్రిష కులమతాల పేరుతో జరుగుతున్న హత్యలపై గొంతెత్తడం లేదు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆ మధ్య జల్లికట్టుపై త్రిష నోరు మెదపలేదేం అంటూ చురకలు వేస్తున్నారు. మరొకరైతే ఇలాంటి ఖండన వల్ల త్రిషకు మూగ జీవాల సంరక్షణ సంస్థ నుంచి మంచి ఆదాయం అందుతోందని ఆరోపించారు. అయితే ఆమె మానవతా దృక్పథాన్నా అభినందించేవారు లేక పోలేదు. మరి ఈ చెన్నై సుందరి నెటిజన్ల ఆరోపణలకు ఎలా బదులిస్తారో చూడాలి.