
నేడు తిరుపతికి షర్మిల
సమైక్య శంఖారావం పూరించడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం తిరుపతికి రానున్నారు.
సాక్షి, తిరుపతి:సమైక్య శంఖారావం పూరించడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం తిరుపతికి రానున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధికి ఘన నివాళులర్పించి, సాయంత్రం 4 గంటలకు షర్మిల తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి లీలామహల్ సెం టర్ వద్ద జరుగనున్న భారీ బహిరంగసభలో ఆమె సమైక్య శంఖారావాన్ని ప్రారంభిస్తారు.
కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వం వహిస్తుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కేంద్ర పాలకమండలి సభ్యురాలు రోజా తదితర నాయకులు ఈ బహిరంగసభలో పాల్గొంటారు. షర్మిల బహిరంగసభలో పాల్గొనేందుకు వేలాది మంది జగన్మోహన్రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు రానున్నారు. బహిరంగసభ ఏర్పాట్ల కు సంబంధించి ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నివాసంలో సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో ఏర్పాట్లపై సమీక్షించారు.
సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ షర్మిల బహిరంగసభను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. పార్టీ నాయకులు షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి వస్తున్న ఆమెకు కరకంబాడి నుంచే స్వాగత ఏర్పాట్లు చేపడుతున్నారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి బహిరంగ సభలో సీనియర్ నాయకులు కూడా ప్రసంగించనున్నారు.
శ్రీకాళహస్తి నుంచి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి, నగరి నియోజవకర్గ సమన్వయకర్త ఆర్కే.రోజా, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఈ సభకు రానున్నారు. సభ అనంతరం షర్మిల తిరుపతిలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం ఆమె పూతలపట్టు మీదుగా చిత్తూరు చేరుకుని, అక్కడ ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత పలమనేరు మీదుగా మదనపల్లె చేరుకుని, సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగసభలో మాట్లాడుతారు. రాత్రి మదనపల్లెలోనే బసచేసి బుధవార ం అనంతపురం జిల్లాకు బయలుదేరనున్నారు.