ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి

Published Fri, Aug 1 2014 2:16 AM

Public health is important to keep in mind

రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని
 కడప అర్బన్ : ప్రజారోగ్యాన్ని ద ృష్టిలో ఉంచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల కోసం మంత్రులు జిల్లా కలెక్టర్‌తో చర్చించారు.
 
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణలో జాగ్రత్త వహించాలని, ఇందులో ఎలాంటి రాజీకి ఆస్కారం లేదన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందువల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వీటి నివారణకు అత్యంత ప్రాధాన్యతతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అందించే తాగునీటిలో క్లోరినేషన్ సమపాళ్లలో చేయాలన్నారు.
 
 ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టాలని ఆదేశించారు. నీటి పైపులైను లీకేజీ లేకుండా చూడాలన్నారు. పట్టణ, గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ ,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు మాట్లాడుతూ దోమకాటు, నీటి కలుషితం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా డయేరియా, కామెర్లు, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. కలెక్టర్ కేవీ రమణ, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement