దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.
కడప కల్చరల్, న్యూస్లైన్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. తిరుమల-తిరుపతి దేవస్థానాల వేద పాఠశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ చిలకపాటి తిరుమలాచార్యులు ఆలయ మండపంలో అలంకరించిన ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అర్చకులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం అర్చకులు, సిబ్బంది ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు వెళ్లి పుట్టమన్ను సేకరించి ఆలయానికి చేర్చారు. ఆ మట్టిలో బీజాలతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
దేవునికడపకే పరిమితమా..?
బ్రహ్మోత్సవాలను కేవలం దేవుని కడపకు పరిమిత ం చేసినట్లు ఉందని నగర వాసులైన పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలకు వారం, పదిరోజుల ముందు నుంచి గుర్రాలు, గంగిరెద్దులను నగరంలో తిప్పుతూ ఉత్సవాల గురించి విస్తృతంగా ప్రచారంచేసే వారని, ఇప్పుడు కేవలం ఒకటి, రెండు చోట్ల ఆర్చీలను ఏర్పాటు చేసి నిర్వాహకులు చేతులు దులుపుకున్నారని వారు ఆరోపించారు.
దేవుని కడపలో పదికి పైగా బ్రహ్మోత్సవాల ఫ్లెక్సీ హోర్డింగులు, డిజిటల్ బోర్డులలో దేవతా రూపాలు ఏర్పాటు చేశారన్నారు. అంతకుమించి కడప నగరంలో ఉత్సవాల ఉనికి తెలిపే సందడి ఏదీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ బోర్డుల వద్ద కనీసం చెత్త కుప్పలను కూడా శుభ్రంచేయకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగరంలో విస్తృత ప్రచారం లేకపోవడంతో 85 శాతం మందికి బ్రహ్మోత్సవాల గురించి తెలియదని వారు ఆరోపిస్తున్నారు.