Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy directions to YSRCP district presidents1
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరఫున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్న దాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలి. – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అన్నింటా ఘోర వైఫల్యం చెందిందని.. యథేచ్ఛగా రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని.. అంతు­లేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే కొనసాగుతోందన్నారు. మంగళవారం తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులతోపాటు రీజినల్‌ కో ఆర్డినేటర్లు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే..చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ద్వారా మీ పనితీరు కూడా బయటపడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైఎస్సార్‌సీపీనే.అక్టోబర్‌లోగా బూత్‌ కమిటీలుమే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్‌ కమిటీలను పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలన్నీ ఏర్పాటవ్వాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది. ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం. గ్రామస్థాయి బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్‌ చేయగలరు? అనేది ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం.వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీరే పార్టీ.. పార్టీయే మీరుమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మణా అదే తలంపుతో పార్టీని నడపాలి. దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం.. రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కమిటీల నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. నాయకత్వ ప్రతిభ బయటపడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇది కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల ఎలివేట్‌ అవుతాం. తద్వారా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది. మన పనితీరు వల్లే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. ప్రజలకు మరింత చేరువవుదాంబాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం కేటాయించామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.ఏడాదిలోపే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతసాధారణంగా రెండు, మూడేళ్లయితే గానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తి స్థాయిలో పని ఉంటుంది. అందరం కలసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్‌ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12 వేల మంది మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1,500 మంది అందుబాటులో ఉంటారు.ప్రజా సమస్యలపై సమన్వయంతో పోరాటంచంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్‌ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌చార్జిని స్వయంగా కలవాలి. వారితో కలసి మొదట -పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

Six dead in wall collapse in Simhachalam Temple2
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి

విశాఖ: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి చోటుచేసుకుంది. భారీగా కురిసిన వానకు గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.. మూడు మృతదేహలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఈ మద్యనే అక్కడ గోడ నిర్మించారు.

Minimum Wages Not implemented in Telugu states3
'వేతన యాతన'!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రలో అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ జరగలేదు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మీక చట్టాల్లో ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా ఆ దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుంచి 2012 మధ్య ఇచ్చిన వేతన సవరణ ఉత్తర్వులే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ ఉపాధి రంగాల్లో కనీస వేతనం రూ. 3,370 నుంచి రూ. 5,138 మధ్య ఉంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వాటిలో దాదాపు 1.27 కోట్ల మంది కార్మీకులు పనిచేస్తున్నారు. వారిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు రాష్ట్ర కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణ చేస్తుంది. అదే తరహాలో అసంఘటితరంగ కార్మికుల వేతన సవరణను కూడా ఐదేళ్లకోసారి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోని కార్మీక వేతన సలహా బోర్డు పాత్ర కీలకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేతన సవరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. కొత్త రాష్ట్రంలో నాలుగు బోర్డులు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగు కనీస వేతన సవరణ సలహా బోర్డులు ఏర్పాటయ్యాయి. మొదటి సలహా బోర్డు 2014 నవంబర్‌లో ఏర్పాటై 2016 నవంబర్‌తో ముగిసింది. రెండో బోర్డు 2016 డిసెంబర్‌ నుంచి 2018 డిసెంబర్‌ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ తదుపరి బోర్డు ఏర్పాటులో జాప్యంతో 2021 ఫిబ్రవరి కొనసాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమైంది. ఆ తర్వాత మూడో బోర్డును ప్రభుత్వం 2023 మేలో ఏర్పాటు చేసింది. అయితే 2023 డిసెంబర్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను రద్దు చేయడంతో ఆ బోర్డు రద్దయ్యింది. 2024 మార్చిలో నాలుగో బోర్డు చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బోర్డును 2024 డిసెంబర్‌లో నియమించింది. ఏయే బోర్డులు ఏం చేశాయి? అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి బోర్డు పలు దఫాల చర్చల అనంతరం అన్‌స్కిల్డ్‌ కార్మీకుడి కనీస వేతనాన్ని రూ. 11,905.36 నుంచి రూ. 12,068.80 మధ్య ఉండేలా సిఫారసు చేసింది. మొత్తం 73 షెడ్యూల్డ్‌ రంగాలకుగాను 34 రంగాలకు ఈ వేతనాలను ఖరారుచేస్తూ కార్మీక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇక రెండో బోర్డు.. మొదటి బోర్డు చేసిన సిఫార్సులను పునఃసమీక్షించి కేటగిరీలవారీగా వేతన సవరణ పూర్తిచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందులో 5 కేటగిరీలకు ప్రభుత్వం జీఓలు ఇచ్చినప్పటికీ వాటిని గెజిట్‌లో చేర్చలేదు. దీంతో మరో 12 కేటగిరీల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. ఇక మిగిలిన 56 కేటగిరీల ప్రతిపాదనల ఊసేలేదు. ఆ తర్వాత ఏర్పాటైన మూడో బోర్డు ప్రస్తుతమున్న ఏడు కార్మిక కేటగిరీలను నాలుగుకు కుదించేందుకు ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మూడో బోర్డు రద్దైంది. ప్రస్తుత నాలుగో బోర్డు పలు దఫాలు సమావేశమైనా ఇంకా నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఈలోగా రేవంత్‌ ప్రభుత్వం గతేడాది మొత్తం 73 ఉపాధి రంగాలకూ కనీస వేతన సవరణ చేయాలని నిర్ణయిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కనీస వేతన సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేతన సవరణ లెక్క సూత్రం... ఒక కార్మీకుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే అందులో కార్మీకుడిని ఒక యూనిట్‌ విలువగా, కార్మికుని భార్యను 0.8 యూనిట్‌గా, ఇద్దరు పిల్లల్ని 0.6 చొప్పున నిర్ధారిస్తారు. లేబర్‌ మినిస్టర్స్‌ కాన్ఫరెన్స్‌ ఆమోదం ప్రకారం ఒక కార్మీకుడు జీవించేందుకు అవసరమైన కేలరీలు 2,700. ఒక కుటుంబానికి ఏడాదికి కావాల్సిన వస్త్రం 72 గజాలు. ఇంటి అద్దె కింద 10 శాతం, పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు 20 శాతం చొప్పున లెక్కించి వేతన సవరణ చేయాలి. సవరణ సమయంలో నిత్యావసరాల ధరలు, మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. శాస్త్రీయత పాటించకుంటే న్యాయ చిక్కులు కార్మికుల కనీస వేతన సవరణ ప్రక్రియను చట్టప్రకారం చేయాలి. అక్రాయిడ్‌ ఫార్ములా ఆధారంగా గణించాలి. గత ప్రభుత్వ నిర్ణయాల కంటే మెరుగ్గా వేతన సవరణ చేస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతున్నా అందుకు శాస్త్రీయత, క్రమపద్ధతి పాటించకుంటే న్యాయ చిక్కులు తప్పవు. – ఎండీ యూసూఫ్, కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్భరంగా కార్మీకుల జీవితాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా వేతన సవరణ జరగకపోవడంతో కార్మీకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా కనీస వేతన సవరణపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం సరికాదు. కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా వేతనాలున్నాయి. – సుంకరి మల్లేశం, ఈపీఎఫ్‌ఓ సీబీటీ మెంబర్, భారత్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఇది శ్రమ దోపిడీయే ప్రభుత్వం దశాబ్దన్నర కాలంగా వేతన సవరణ చేయకపోవడం కార్మీకుల శ్రమను దోచుకోవడమే. మొత్తం 73 ఉపాధి రంగాలకు వేతనాలను సవరించాలని రెండో కార్మీక వేతన సవరణ సలహా బోర్డు 2021 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అందులో 5 ఉపాధి రంగాలకు తుది ఉత్తర్వులు వెలువడ్డా గెజిట్‌లో ప్రచురించకపోవడం, మిగిలిన ఉపాధి రంగాలకు జీఓలు ఇవ్వకపోవడంతో కార్మీకులు నష్టపోతున్నారు. – దేవసాని భిక్షపతి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణకు పడని ముందడుగుఅన్‌స్కిల్డ్‌ కార్మీకుడైన నర్సింహ 20 ఏళ్లుగా ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ రంగానికి సంబంధించి జరిగిన వేతన సవరణ ప్రకారం ఆయన నెలవారీ కనీస వేతనంరూ. 3,370గా ఖరారైంది. ఆ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నర్సింహ అందుకుంటున్న వేతనం రూ. 12,420 మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో కనీస వేతన సవరణ సలహా బోర్డు సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 22 ప్రకారం నర్సింహ నెలవారీ కనీస వేతనం రూ. 23,275గా ఉండాలి. కానీ ఆ జీఓను గెజిట్‌లో ప్రచురించకపోవడం వల్ల ఆయన ఏకంగా రూ. 10,855 తక్కువ వేతనం పొందుతున్నాడు.

Rasi Phalalu: Daily Horoscope On 30-04-2025 In Telugu4
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అనుకూలం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.తదియ రా.6.20 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: రోహిణి రా.8.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.12.53 నుండి 2.24 వరకు, తదుపరి రా.1.45 నుండి 3.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.25 వరకు, అమృతఘడియలు: సా.5.26 నుండి 6.57 వరకు, అక్షయతృతీయ; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. మేషం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగులకు గందరగోళం.వృషభం.... మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మిథునం.... ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో చికాకులు. బంధువులతో అకారణ వైరం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.కర్కాటకం.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.సింహం.... మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.కన్య.... వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. సోదరులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.తుల.... ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ప్రయాణాలు వాయిదా. పనులు నిదానంగా సాగుతాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దైవదర్శనాలు.వృశ్చికం... ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.ధనుస్సు.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.మకరం... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం.కుంభం.... బంధువులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం.మీనం.... వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

PM Modi gives armed forces full freedom to decide mode target of India response to Pahalgam terror attack5
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ

‘పహల్గాం’కు త్వరలో దీటైన జవాబు... ఎప్పుడు, ఎక్కడ, ఎలాగన్నది వారిష్టం బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో భేటీ పాల్గొన్న రాజ్‌నాథ్, ఎన్‌ఎస్‌ఏ దోవల్‌ ఎన్‌ఎస్‌జీ చీఫ్‌తో హోం కార్యదర్శి భేటీ పాల్గొన్న బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ చీఫ్‌లు సరిహద్దుల్లో కొనసాగిన పాక్‌ కాల్పులుఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలి.ప్రతీకారానికి వేళైంది. ఉగ్ర వేటకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా మంగళవారం రోజంతా కీల క పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘పహల్గాం’ కు దీటుగా బదులిచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసముంది. ‘పహల్గాం’ ముష్కరులకు, వారి సూత్రధారుల కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులిస్తారో మీ ఇష్టం’’ అంటూ ఫుల్‌ పవర్స్‌ ఇచ్చేశారు. మరోవైపు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కూడా మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్‌ఎస్‌జీ చీఫ్‌తో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ తదితర కీలక దళాల చీఫ్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మరిన్ని కీలక పరిణామాలు బుధవారం చోటు చేసుకోనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా భద్రత, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీలతో మోదీ వరుస భేటీలు, ఆపై కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనున్నాయి. దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగాలవారీగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించి ఆమోదముద్ర వేస్తారని తెలుస్తోంది.న్యూఢిల్లీ: ‘పహల్గాం’ ముష్కరులకు, వెనకుండి వారిని నడిపిస్తున్న దాయాది దేశానికి మర్చిపోలేని గుణపాఠం చెప్పేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమవుతోంది. ఆ పాశవిక ఉగ్ర దాడికి పాల్పడ్డ, ప్రేరేపించిన వారు కలలో కూడా ఊహించని రీతిలో శిక్షించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అంతం చేసి తీరాల్సిందే. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఖతం చేయాలన్నది దేశ సమష్టి సంకల్పం.పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇవ్వక తప్పదు. ఉగ్ర ముష్కరులపై మన ప్రతిస్పందన ఎలా ఉండాలో నిర్ణయించే స్వేచ్ఛను సైన్యానికే ఇస్తున్నాం. శత్రువుపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయమైనా సైన్యం తనంత తానుగా తీసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులు జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గంటన్నరపాటు జరిగిన ఈ కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో పాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనీల్‌ చౌహాన్‌ కూడా పాల్గొన్నారు.పహల్గాం దాడి, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. తగిన ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనని ప్రధాని పునరుద్ఘాటించారు. సైనిక దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసముందన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ తీరుపై ప్రధాని ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డట్టు సమాచారం. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలని ఆయన నిర్దేశించారు.ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లో పహల్గాం సమీపంలోని బైసారన్‌ లోయలో అమాయక పర్యాటకులపై పాక్‌ ప్రేరేపిత లష్కరే తొయిబా ముసుగు సంస్థకు చెందిన ముష్కరులు కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనిపై 140 కోట్ల పై చిలుకు భారతీయుల రక్తం మరిగిపోతోందని, ముష్కరులతో పాటు వారిని ప్రేరేపించిన వారిని కూడా కఠినాతి కఠినంగా శిక్షించి తీరతామని ఆదివారం మన్‌ కీ బాత్‌లో కూడా మోదీ పునరుద్ఘాటించారు. హోం శాఖ ఉన్నత స్థాయి భేటీ త్రవిధ దళాధిపతులతో మోదీ సమావేశానికి ముందే మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ సారథ్యంలో మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ చౌదరి, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) డీజీ బ్రిఘూ శ్రీనివాసన్, అస్సాం రైఫిల్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వికాస్‌ లఖేరా, సశస్త్ర సీమాబల్‌ అదనపు డీజీ అనుపమ నీలేకర్‌ చంద్రతో పాటు పలువురు సీనియర్‌ సైనికాధికారులు ఈ కీలక భేటీలో పాల్గొన్నారు.పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల అణచివేతతోపాటు దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నా అసలు అజెండా వేరేనంటున్నారు. భేటీలో చర్చించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచారు. పాక్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల రక్షణ బీఎస్‌ఎఫ్‌ బాధ్యత. మయన్మార్‌ సరిహద్దులను అస్సాం రైఫిల్స్‌ గస్తీ కాస్తుంది. ఇక ఎన్‌ఎన్‌జీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషలైజ్డ్‌ కమెండో విభాగం.2016లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ 2019లో ‘బాలాకోట్‌’ ఇప్పుడెలా ఉంటుందో!ప్రతీకార చర్యలపై ఉత్కంఠసైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముష్కర మూకపై, వారికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న దాయాదిపై ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉగ్ర దాడులకు ప్రతిస్పందనగా మోదీ సర్కారు పాక్‌ భూభాగంపై 2016లో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్, 2019లో చేసిన బాలాకోట్‌ వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. భారత్‌ నుంచి ఈ స్థాయి దాడులను ఊహించని పాక్‌ ఒక్కసారిగా బిత్తరపోయింది. 2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టర్లో సైనిక క్యాంప్‌పై జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా సైన్యానికి చెందిన స్పెషల్‌ ఫోర్సెస్‌ కమెండోలు పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశారు. కనీసం 200 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశారు. 2019లో జమ్మూలోని పుల్వామాలో సీఆరీ్పఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో వైమానిక దాడులు జరిపి వందలాది మంది ముష్కరులను మట్టుబెట్టింది.12 మిరాజ్‌ ఫైటర్‌ జెట్లు పాక్‌ కన్నుగప్పి, వారి రాడార్‌ వ్యవస్థలను ఏమార్చి లక్ష్యాలపై నిప్పుల వర్షం కురిపించాయి. బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ శిక్షణ స్థావరాలను నామరూపాల్లేకుండా చేసింది. గత అనుభవాల నేపథ్యంలో సర్జికల్‌ స్ట్రైక్స్, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు పాక్‌ సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కనుక ఈసారి కూడా భారత ప్రతి చర్య దాయాది ఊహించని విధంగా ఉంటుందని రక్షణ నిపుణులు అంటున్నారు. ‘‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో క్షిపణి దాడుల వంటివి ఒక ఆప్షన్‌. కానీ ఆ క్రమంలో పాక్‌ ఆర్మీ యూనిట్లకు నష్టం వాటిల్లితే పరిస్థితి అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. కనుక ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే’’ అని చెబుతున్నారు.

Liberal Party Mark Carney wins election in Canada6
లిబరల్‌ పార్టీ విజయం

టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్‌ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్‌ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్‌ మాదిరిగా కెనడా ఫస్ట్‌ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్‌ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్‌ తరంకాదు: మార్క్‌ కార్నీ లిబరల్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్‌ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్‌ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్‌ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్‌ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్‌ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్‌ దలీవాల్‌(లిబరల్‌) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింత్‌(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్‌ పార్టీ అభ్యర్థి వేడ్‌ చాంగ్‌ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

BJP top leadership selects Paka Satyanarayana for Rajya Sabha seat7
ఢిల్లీలో పారని బాబు పాచిక!

సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్‌ కూడా చేయించారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.రకరకాల ప్రచారాలు..ఎత్తులుతాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్‌ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సు­దీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది. చంద్రబాబుకు షాకే!చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి. కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్‌లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sakshi Guest Column On Kashmir Pahalgam Terrorism Issue solution8
ఇంతకూ పరిష్కారం ఏమిటి?

పహల్‌గామ్‌లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్‌ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్‌ రెసిస్టెన్స్‌’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్‌తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు. తీవ్రవాదుల కోసం కశ్మీర్‌లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్‌కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట. యుద్ధంతో మనకూ నష్టమే!కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్‌ రైఫిళ్లు, లైట్‌ మెషీన్‌ గన్స్, సబ్‌ మెషీన్‌ గన్స్‌. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు. సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు! త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్‌ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్‌ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్‌తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్‌ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్‌ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్‌ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్‌లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్‌లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.నీటిని ఆపగలమా?ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్‌ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్‌కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. పాకిస్తాన్‌కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ (ఐబీఆర్‌డీ) సంతకం చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు. ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.వాస్తవాధీన రేఖే పరిష్కారమా?మనం విస్మరించేదేమంటే కశ్మీర్‌ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్‌ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్‌ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.కశ్మీర్‌కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్‌ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ, లేదా లైనా ఆఫ్‌ కంట్రోల్‌)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?ఇది భారత–పాకిస్తాన్‌ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్‌లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్‌ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది. 1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్‌ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Rahul write to PM Modi urging special Parliament session over Pahalgam terror attack9
పార్లమెంట్‌ను సమావేశపర్చండి

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఈ పాశవిక చర్యపై చర్చించడంతోపాటు దేశమంతా ఐక్యంగా ఉందనే విషయాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందన్నారు. గత వారం చోటుచేసుకున్న దారుణ ఘటనలో 26 మంది పర్యాటకులు అసువులు బాయడం తెల్సిందే.ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరారు. ‘ఈ సమయంలో ఐక్యత, సంఘీభావం ప్రకటించాల్సిన అవసరముంది. వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమని ప్రతిపక్షం విశ్వసిస్తోంది.అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి మనందరి సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది’అని ఆయన తెలిపారు. ప్రధానికి రాసిన లేఖలో రాహుల్‌ గాంధీ సైతం ఇదే విషయం తెలిపారు.

KKR defeated Delhi Capitals by 14 runs10
నైట్‌రైడర్స్‌ గెలుపు బాట

ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలకు పూర్తిగా తెర పడిపోకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గత మూడు మ్యాచ్‌ లలో రెండు పరాజయాలు, ఒక మ్యాచ్‌ రద్దు తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సమష్టి బ్యాటింగ్‌తో 200 పరుగుల స్కోరు దాటిన టీమ్‌... ఢిల్లీని వారి వేదికపై కట్టడి చేయడంలో సఫలమైంది. ముఖ్యంగా మ్యాచ్‌ చేజారుతున్న దశలో నరైన్‌ 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పాడు. న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌ 18వ సీజన్‌లో కీలక విజయం దక్కింది. గెలిస్తేనే నిలిచే స్థితిలో మంగళవారం బరిలోకి దిగిన కేకేఆర్‌ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్‌కృష్‌ రఘువంశీ (32 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విప్‌రాజ్‌ నిగమ్‌ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సునీల్‌ నరైన్‌ (3/29) మూడు ప్రధాన వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ జోరుగా సాగింది. చమీరా ఓవర్లో సునీల్‌ నరైన్‌ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టగా...స్టార్క్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదిన రహ్మనుల్లా గుర్బాజ్‌ (12 బంతుల్లో 26; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అదే ఓవర్లో అవుటయ్యాడు. తొలి 6 ఓవర్లలో మొత్తం 79 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో నరైన్, అజింక్య రహానే (14 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (7) వికెట్లను కేకేఆర్‌ కోల్పోయింది. ఈ స్థితిలో రఘువంశీ, రింకూ ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో కోల్‌కతా కట్టడి చేయడంలో ఢిల్లీ సఫలమైంది. 3 పరుగుల వ్యవధిలో రఘు, రింకూ వెనుదిరగ్గా... స్టార్క్‌ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు పడ్డాయి. రాణించిన డుప్లెసిస్‌ ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. పొరేల్‌ (4), కరుణ్‌ నాయర్‌ (15), కేఎల్‌ రాహుల్‌ (7) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే డుప్లెసిస్, అక్షర్‌ భాగస్వామ్యంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు రేగాయి. నాలుగో వికెట్‌కు డుప్లెసిస్, అక్షర్‌ 42 బంతుల్లోనే 76 పరుగులు జత చేశారు. 41 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ను నరైన్‌ అవుట్‌ చేయడంతో ఆట మలుపు తిరిగింది. అదే ఓవర్లో స్టబ్స్‌ (1) కూడా వెనుదిరగ్గా... నరైన్‌ తన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ను కూడా వెనక్కి పంపించాడు. 10 పరుగుల వ్యవధిలో ఈ 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) పొరేల్‌ (బి) స్టార్క్‌ 26; నరైన్‌ (ఎల్బీ) (బి) విప్‌రాజ్‌ 27; రహానే (ఎల్బీ) (బి) అక్షర్‌ 26; రఘువంశీ (సి) నాయర్‌ (బి) చమీరా 44; వెంకటేశ్‌ (సి) విప్‌రాజ్‌ (బి) అక్షర్‌ 7; రింకూ (సి) స్టార్క్‌ (బి) విప్‌రాజ్‌ 36; రసెల్‌ (రనౌట్‌) 17; పావెల్‌ (ఎల్బీ) (బి) స్టార్క్‌ 5; అనుకూల్‌ (సి) చమీరా (బి) స్టార్క్‌ 0; హర్షిత్‌ (నాటౌట్‌) 0; వరుణ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–91, 4–113, 5–174, 6–177, 7–203, 8–203, 9–203. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–43–3, చమీరా 3–0–46–1, ముకేశ్‌ 2–0–17–0, విప్‌రాజ్‌ 4–0–41–2, అక్షర్‌ పటేల్‌ 4–0–27–2, కుల్దీప్‌ 3–0–27–0. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పొరేల్‌ (సి) రసెల్‌ (బి) అనుకూల్‌ 4; డుప్లెసిస్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 62; కరుణ్‌ నాయర్‌ (ఎల్బీ) (బి) అరోరా 15; రాహుల్‌ (రనౌట్‌) 7; అక్షర్‌ (సి) హర్షిత్‌ (బి) నరైన్‌ 43; స్టబ్స్‌ (బి) నరైన్‌ 1; విప్‌రాజ్‌ (బి) రసెల్‌ 38; అశుతోష్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 7; స్టార్క్‌ (సి) గుర్బాజ్‌ (బి) వరుణ్‌ 0; చమీరా (నాటౌట్‌) 2; కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–60, 4–136, 5–138, 6–146, 7–160, 8–160, 9–189.బౌలింగ్‌: అనుకూల్‌ రాయ్‌ 4–0–27–1, వైభవ్‌ అరోరా 2–0–19–2, హర్షిత్‌ రాణా 4–0–49–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–39–2, నరైన్‌ 4–0–29–3, రసెల్‌ 2–0–22–1. ఐపీఎల్‌లో నేడుచెన్నై X పంజాబ్‌ వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement