వేలూరు: బాల కార్మికుల రహిత జిల్లాగా వేలూరును చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ లీలఅలెక్స్ అన్నారు. బాలకార్మికుల దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోని అధికారులతో బాలకార్మికులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాల పిల్లలను బడిలోకి పంపించాలని కోరారు. అదేవిధంగా 14 సంవత్సరాలలోపు పిల్లలను బాలకార్మికులగా పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో 50 మంది బాలకార్మికులను ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో ఉంచామన్నారు. బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం బాలకార్మికులు పాఠశాలల్లో చదివి కళాశాల విద్యకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా బాలకార్మికులు ఉండే అవకాశం ఉన్నందున అధికారులతోపాటు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బాలకార్మికుల వ్యతిరేక పథకం జాయింట్ అధికారి గుణశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ సంగీత, బాలకార్మికుల శాఖ ఇన్స్పెక్టర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


