బాలుడి హత్య కేసు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బాలుడి హత్య కేసు నిందితుల అరెస్ట్‌

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

నాలుగు నెలల తరువాత బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం తిరుత్తణిలో కలకలం రేపిన హత్య కోళ్ల వ్యాపారి, అతని భార్య సహా నలుగురి అరెస్ట్‌

తిరుత్తణి: కోళ్ల సంఖ్య రోజు రోజుకి తగ్గడంతో ఆగ్రహించిన కోళ్ల వ్యాపారి పనిచేసే బాలుడిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ హత్య నాలుగు నెలలకు వెలుగు చూసింది. పోలీసుల సమక్షంలో మృతదేహం వెలికి తీసి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించి కోళ్ల వ్యాపారితో పాటు అతని భార్య, మైనర్‌ కూతురు సహా నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణిలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన బాల మురుగన్‌(39) ఏడాది కిందట మురుక్కంపట్లు గ్రామంలో వ్యవపాయ పొలం లీజుకు తీసుకుని కోళ్లఫారం పెట్టి నాటు కోళ్లు పెంచి కుటుంబంతో కాపురం అక్కడే ఉంటున్నాడు. అతని ఫారంలో పని చేసేందుకు తిరుత్తణి ఇంద్రనగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌(20) అనే యువకుడు అతని సమీప బందువు వెన్నెల(35) ఆమె ముగ్గురు బిడ్డలను తీసుకొచ్చి పనిలో పెట్టాడు. వెన్నెల అతని ముగ్గురు మగ పిల్లలతో ఆరు నెలలుగా కోళ్లఫారంలో పనులు చేసుకుంటూ వెన్నెల అక్కడే ఉండేవారు. ఈ క్రమంలో వెన్నెల పెద్ద కొడుకు సురేష్‌(15) అనే బాలుడు నాటు కోళ్లను మేపుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కోళ్ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతున్నాయన్న ఆగ్రహంతో నాలుగు నెలల కిందట సురేష్‌ను తల్లి కళ్లముందే తీవ్రంగా కొట్టాడు. దీంతో సురేష్‌ మృతిచెందాడు. దీంతో చేసేదేమీ లేక పేదరికంలో ఉన్న వెన్నెలకు ఇల్లు కట్టిస్తానని డబ్బులు ఆశలు చూసి నోరు మూయించాడు. వినోద్‌కుమార్‌ సాయంతో సురేష్‌ మృతదేహాన్ని కోళ్లఫారంలో పూడ్చిపెట్టి కోళ్లు నీళ్లు తాగేందుకు అక్కడ నీటితొట్టె కట్టారు. దీంతో నాలుగు నెలలు పూర్తికావడంతో వెన్నెలకు చెప్పిన మాట ప్రకారం ఇల్లు కట్టివ్వలేదు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడడంతో కోళ్ల పారం నుంచి తప్పించుకుని గురువారం రాత్రి తిరుత్తణి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె సమాచారం మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు బాలమురుగన్‌, వినోద్‌కుమార్‌లను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ వివేకానంద శుక్ల, ట్రైనీ కలెక్టర్‌ పవిత్ర, న్యాయమూర్తి నళినిదేవి తదితరుల బృందం సమక్షంలో కోళ్లఫారంలో మృతదేహం జేసీబీతో వెలికి తీసి తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు.

నలుగురి అరెస్ట్‌

కోళ్లఫారంలో తల్లి ఎదుట సురేష్‌ను కొట్టి చంపిన బాల మురుగన్‌ అతనికి సాయం చేసిన వినోద్‌కుమార్‌, సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బాలమురుగన్‌ భార్య భువన(35) వారి 15 ఏళ్ల మైనర్‌ కూతురు సహా నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement