తమిళసినిమా: దర్శకుడు పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ పలు వైవిధ్య భరిత కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలో ఎక్కువగా పా.రంజిత్ శిష్యులే దర్శకత్వం వహిస్తున్నారు. పా.రంజిత్ ఇంతకు ముందు పరియేరుమ్ పెరుమాళ్,సార్పట్ట పరంపరై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. కాగా తాజాగా ఈ సంస్థ నూతన చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం ద్వారా నా.రంజిత్ శిష్యుడు సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు మణికంఠన్ కథానాయకుడిగా నటించనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న మణికంఠన్ ఇంతకు ముందు గుడ్ నైట్, లవర్స్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దర్శకుడు పా.రంజిత్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి మక్కళ్ కావలన్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇది సాధారణ ప్రజల జీవన విధానాన్ని, రాజకీయాలను చర్చించే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. త్వరలో ప్రారంభం కానునున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. నా.రంజిత్ నిర్మించనున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.


