సాక్షి, చైన్నె: ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగ దారుల కోసం స్మార్ట్ చాయిస్ ఫీచర్ను ఆవిష్కరించి, 10 కొత్త విభాగాలకు విస్తరించినట్టుఅమెజాన్ ఇండియా డైరెక్టర్ జెబా ఖాన్ తెలిపారు. లాప్టాప్లు, టాబ్లెట్లు, ఆడియో డివైజ్లు, కెమెరాలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు , మానిటర్లు, పీసీ యాక్సెసరీలు వేరబుల్స్ వంటి విభాగాలలో ఈ సేవలు ఇకపై అందుబాటులోకి రానున్నాయని వివరించారు. త్వరలోనే టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నామన్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనేటప్పుడు వందలాది స్పెసిఫికేషన్లు చూసి వినియోగదారులు కన్ఫ్యూజ్ అవుతుంటారని, అలా కాకుండా, కస్టమర్ల నిజ జీవిత అవసరాలకు అనుగుణంగా సరైన వస్తువును ఎంచుకోవడానికి ఈ ఫీచర్ సహాయపడుతుందని వివరించారు. ఈ సిఫార్సుల కోసం అమెజాన్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ అయిన రూఫస్ , లెన్స్ ఏఐ, ఏఐ రివ్యూ సమ్మరీలు, ప్రైస్ హిస్టరీ టూల్స్ను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంటూ, గురువారం నుంచి స్మార్ట్ చాయిస్ డేస్ విక్రయాలకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు.
అన్నానగర్: తిరుపత్తూరు జిల్లా జోలార్పేటై సమీపంలోని ఏలగిరిమలై పాడనూర్ సమీపంలోని ప్రాంతానికి చెందిన దేవేంద్రన్, చిత్ర దంపతుల కుమార్తె అంజలి (23) సేలంలోని కళాశాలలో చదువుతోంది. ఈ స్థితిలో అదే కళాశాలలో చదువుతున్న, ధర్మపురి జిల్లాలోని బాపిరెడ్డి ప్రాంతానికి చెందిన విద్యార్థి కేశవన్, అంజలి ప్రేమలో పడ్డారు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో, ఇద్దరి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు, అప్పటి నుండి ఒక సంవత్సరం గడిచింది. పెళ్లికి ముందు, వాళ్లిద్దరూ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి, పెళ్లి చేసుకుని జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్లకు ఒక ఆడపిల్ల ఉంది.ఈ స్థితిలో, అంజలి తల్లి చిత్ర హృదయ విచారకరంగా బాధపడి, తన కూతురు అంజలిని, మనవడిని ఏలగిరి కొండల పాదాల వద్ద ఉన్న మంజన్ వట్టం ప్రాంతానికి తీసుకువచ్చింది. ఇది చూసి, చిత్ర సోదరుడు కృష్ణన్ నాటు తుపాకీ తెచ్చి అంజలిని కాల్చడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ విషయం ఏలగిరి కొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
కొరుక్కుపేట: చైన్నె, పరిసర ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ కోతలు కొనసాగడంతో, ప్రజలు గుమిగూడి రోడ్లను దిగ్బంధించారు, విద్యుత్ బోర్డు కార్యాలయంపై దాడి చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు చైన్నెలోని సైదాపేటలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీని కారణంగా, తీవ్రమైన వేడిమి, దోమల బెడదతో బాధపడుతున్న ప్రజలు విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఆ ప్రాంతంలోని లైన్మెన్ల నుండి ఉన్నతాధికారుల వరకు అందరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. ఆగ్రహించిన ప్రజలు అక్కడ ఉన్న విద్యుత్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలిసుకుని విద్యుత్ శాఖ మంత్రి నిరంతరాయ విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని వాగ్దానం చేశారు. ఆ తర్వాత ప్రజలు నిరసనను విరమించారు.
కార్వేటినగరం: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గురువారం రాత్రి గజవాహనంపై , ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోలాట ప్రదర్శనలు, భక్తజనుల గోవింద నామస్మరణల నడుమ వాహన సేవలు వైభవంగా సాగాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో నేడు సూర్య, చంద్రప్రభ వాహనంపై విహరిస్తారని ఆలయాధికారి చంగ్రల్రాజు తెలిపారు.


