తిరువళ్లూరు: ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇంటి పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మాజీ వార్డు మెంబర్ తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించిన సంఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం కొడువెళి, అయనం, పుదుకుప్పం, అమ్మనంబాక్కం, ఆయల్చ్చేరి, మాగరల్, గురువాయల్, అగరంపట్టు, వెంగల్, వెంగల్కుప్పంతోపాటు 15 గ్రామాలకు జమాబందీని నిర్వహించారు. ఆర్డీఓ రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజీ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అమ్మనంబాక్కంకు చెందిన మాజీ వార్డు మెంబర్ ఉమాపతి తాను నివాసం వుంటున్న స్థలానికి పట్టా ఇవ్వాలని వినతి సమర్పించారు. అయితే అప్పటికే ఉమాపతి భార్య, తండ్రి పేరుతో పట్టాలు ఇచ్చామని ప్రస్తుతం వున్న స్థలం ప్రభుత్వానికి చెందిన భూమి కావడంతో అక్కడ పట్టా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆగ్రహించిన ఉమాపతి పెట్రోల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహుతికి యత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఉమాపతిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయంలో బెదిరింపులకు దిగిన ఉమాపతిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.


