సాక్షి, చైన్నె: తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించినానంతరం రెండోసారిగా బుధవారం విజయ్ ఢిల్లీకి వెళౠ్లరు. గురువారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. తమిళనాడు భవన్లో బస చేశారు. ముందుగా ఆయనకు తమిళనాడు భవన్భద్రతా సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్రపతి భవన్కు సీఎం విజయ్ తొలిసారిగా వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను కలుసుకున్నారు. సాయంత్రం ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా విజయ్ కలిశారు. తొలి రోజు పర్యటన అంతా మర్యాద పూర్వక పలకరింపులేనని అధికార వర్గాలు ప్రకటించాయి.
నేడు నీతి ఆయోగ్ భేటికి హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. ఈ వేదికపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి సారిగా కనిపించనున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధుల కేటాయింపు, కేంద్రం నుండి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, గత నెల 27న ప్రపథమంగా విజయ్ సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. గత భేటీలో సోనియా, రాహుల్ గాంధీతో భేటీ కాలేని పరిస్థితి నెలకొంది. అయితే, తాజాగా ఆయన వారితో సమావేశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి విజయ్ విడిగా సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు చైన్నెకు సీఎం విజయ్ తిరుగు పయనం కానున్నారు.


