మనవడి దాడిలో అమ్మమ్మ మృతి
అన్నానగర్: కల్పాక్కం సమీపంలో మద్యం మత్తులో బామ్మ చెంపపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయి మరణించగా, ఈ ఘటనకు సంబంధించి ఆమె మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెంగల్పట్టు జిల్లాలోని కల్పాక్కం సమీపంలోని వెంబాక్కం గ్రామం పూన్ తండలం ప్రాంతానికి చెందిన మునుస్వామి. ఇతను తల్లి నాయనమ్మ సరోజ (94), తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంగళవారం రాత్రి మునుస్వామి తల్లి సరోజ ఇంటి గుమ్మం ముందు మంచం మీద పడుకుని ఉంది. ఆ సమయంలో మునుస్వామి కుమారుడు మహేష్ (26) అక్కడికి మద్యం మత్తులో వచ్చాడు. వృద్ధాప్యం కారణంగా నాయనమ్మ సరోజ ఏడుస్తూ ఉంది. అమ్మమ్మ సరోజ ఏడుపు విన్న రాజేష్ ఆమె చెంపపై కొట్టాడు. సరోజ స్పృహ తప్పి మంచం మీద పడిపోయి మరణించించారు. విచారణలో మహేష్ మద్యం మత్తులో తన నాయనమ్మను కొట్టాడని తేలడంతో అరెస్టు చేసి చెంగల్పట్టు జైలుకు తరలించారు.
ఏటీఎం కార్డుల దొంగ అరెస్టు
అన్నానగర్: చైన్నెలోని అరుంబాక్కం ప్రాంతానికి చెందిన తిలకేష్ కుమార్. ఇతను కోయంబేడు నురోడి రోడ్డులోని ఏటీఎం కేంద్రంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు, తన ఏటీఎం కార్డును బయటకు తీయడం మర్చిపోయి మెషీన్లోనే వదిలేశాడు. ఈ స్థితిలో, అదే ఏటీఎం కార్డు ద్వారా 4 విడతలలో రూ. 50 వేలు విత్డ్రా అయినట్లు తన సెల్ ఫోన్కు మెసేజ్ రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. కోయంబేడు బస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఘా కెమెరా రికార్డింగ్లను పరిశీలించగా, సాలిగ్రామం ప్రాంతానికి చెందిన విశ్వనాథన్ (62) ఏటీఎం మెషీన్లో వదిలేసిన కార్డును దొంగిలించి డబ్బులు విత్డ్రా చేసినట్లు తేలింది. పోలీసులు అతడిని బుధవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మరో 30కి పైగా ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పనపాక్కం గారమానికి చెందిన రిత్తిశ్రీ(22) రెడ్హిల్స్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం యధావిధిగా విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో రెడ్హిల్స్ నుంచి పనపాక్కంకు బయలుదేరాడు. ప్రస్తుతం చైన్నె–పెద్దపాళ్యం మార్గంలో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్న క్రమంలో జయపురం వద్ద వన్వేగా మార్చి పనులు సాగిస్తున్నారు. దీంతో జయపురం వద్ద వన్వేలో రిత్తిశ్రీ వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలోరిత్తిశ్రీ ఘటనా స్థఽలంలోనే మృతి చెందాడు. పెద్దపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
సెల్ఫొన్ల దొంగ అరెస్టు
తిరుత్తణి: తిరుత్తణిలో ప్రయాణికుల రద్దీని వినియోగించుకుని చేతివాటం ప్రదర్శించే సెల్ఫోన్ దొంగను ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణిలో కొత్త బస్టాండు, పాత బస్టాండు, బైపాస్, రైల్వే స్టేషన్ సహా ప్రధాన ప్రాంతాల్లో బస్టాండ్ల వద్ద ప్రయాణికుల రద్దీని వినియోగించుకుని తొందగా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో సెల్పొన్లు చోరీ ఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బైపాస్ బస్టాపు వద్ద తిరుత్తణికి చెందిన సంతోష్(22) అనే యువకుడు బస్సు ఎక్కి సమయంలో అతని షర్ట్ ఫ్యాకట్లోని సెల్ఫొన్ చోరీకి విఫలయత్నం చేసిన యువకుడిని ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణి సీఐ శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తులో తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కం ప్రాంతంకు చెందిన చిన్నదురై(22) అనే వ్యక్తి రద్దీని వినియోగింయచుకుని ప్రయాణికుల వద్ద సెల్ఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు.
జుట్టు సంరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, చైన్నె: ప్రస్తుతం జుట్టు సంరక్షణపై అత్యధిక శాతం మంది దృష్టి పెడుతున్నారని బ్యూటీ గ్యారేజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిగర్ రవారియా పేర్కొన్నారు. జుట్టు సంరక్షణలో సాంప్రదాయక నూనెలకు, నిజమైన తేమను నిలిపి ఉంచే విధానానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరిస్తూ బుధవారం ఆయన స్థానికంగా వివరాలను ప్రకటించారు. ఇందులో షే బటర్ పాత్ర ఎంత కీలకమైనదో వివరించారు. జుట్టులో ఉన్న తేమ బయటకు పోకుండా లాక్ చేయడానికి మాత్రమే నూనెలు ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు.అందుకే నూనె రాసిన కొద్దిసేపటికే జుట్టు మళ్లీ పొడిబారిపోతుందన్నారు. జుట్టు ఆరోగ్యంగా, స్థితిస్థాపకతతో ఉండాలంటే కేవలం పైన నూనె పూయడం సరిపోదని, జుట్టు అంతర్గత నిర్మాణాన్ని బలోపేతం చేసి, ఎక్కువసేపు నీటిని నిలిపి ఉంచేలా చేయడం ముఖ్యం అని వివరించారు. ఆధునిక ప్రొఫెషనల్ హెయిర్ కేర్ ప్రోడక్టులు తాజాగా ఈ విధానంపైనే దృష్టి పెడుతున్నాయని వివరించారు.


