ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ అలజడి చెలరేగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో శనివారం కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటెగ్రిటీ (కోకోమీ-మణిపూర్ సమగ్రత కోసం ఏర్పడిన సమాఖ్య) ర్యాలీ నిర్వహించింది. నగరవ్యాప్తంగా ఘర్షణలు జరిగాయి, పలువురు గాయపడ్డారు.
ర్యాలీ మధ్యాహ్నం ఒంటి గంటకు 8 ప్రాంతాల నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ అధికార నివాసం వైపు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చెలరేగి ఘర్షణలకు దారితీసింది.
ఇంఫాల్ మధ్య ప్రాంతంలోని ఓవర్బ్రిడ్జ్ వద్ద పోలీసులు నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చి 10 నిమిషాల్లో వెళ్లిపోవాలని చెప్పారు. కానీ, వారు నిరాకరించారు. ఇమా కైథెల్, అలూ గలి మార్కెట్ ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి.
ఆ తర్వాత భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టాయి. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు, ఇమా కైథెల్ వద్ద దాగి ఉన్న వ్యక్తుల వద్ద నుంచి స్లింగ్స్, కటపుల్ట్లు స్వాధీనం చేసుకున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు మార్కెట్లు మూసివేయడంతో సాధారణ జీవనం ప్రభావితమైంది. కోకోమీ తెలిపిన ప్రకారం ఈ ర్యాలీ ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నిర్వహించారు. అందులో ఆరోపిత ప్రాక్సీ వార్, నార్కో టెర్రరిజం, ఇటీవలి హత్యలు, సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ, అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (ఐడీపీలు – దేశంలోనే వేరే ప్రాంతాలకు తరలిన బాధితులు) పునరావాసం, కుకీ తిరుగుబాటుదారులతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ రద్దు వంటి అంశాలు ఉన్నాయి.
కోకోమీ ప్రతినిధి నహాక్పామ్ శాంతా మాట్లాడుతూ, 2023 మే నుంచి జరిగిన పరిణామాలు, తాజా ఘటనల నేపథ్యంలో ప్రజలు భారీగా బయటకు వచ్చారని తెలిపారు. సోఓ రద్దు, నార్కో టెర్రరిజంపై చర్యలు, ట్రోంగ్లాఓబి దాడి, ఉఖ్రుల్ హైవే అంబుష్ వంటి ఘటనల్లో మృతి చెందిన వారికి న్యాయం కోరుతూ కోకోమీ ఉద్యమాలు చేపట్టిందని చెప్పారు.
ప్రభుత్వానికి పలు డిమాండ్లతో మెమొరాండం అందజేస్తామని శాంతా తెలిపారు. నిరాశ్రయుల పునరావాసంపై ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపిస్తూ, జనగణన లేదా ఎన్ఆర్సీ (జాతీయ పౌర నమోదు ప్రక్రియ) వంటి ప్రక్రియల కంటే ముందు ఈ సమస్య పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే పలు మెమొరాండాలు సమర్పించినప్పటికీ స్పష్టమైన నివేదిక ఇవ్వలేదని చెప్పారు.
నిరసనలో పాల్గొన్న స్థానికుడు అజిత్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఉద్యమం దేశ వ్యతిరేకం కాదని, న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఇప్పటికీ న్యాయం లభించలేదని, ప్రబుత్వం మౌనం ఎందుకు వహిస్తుందని ప్రశ్నించారు.


