
రాజస్థాన్లో ప్రాచుర్యం పొందుతున్న ‘కుకాస్ నమూనా’
కరువుకు ప్రత్యామ్నాయపదంగా మారిన రాజస్థాన్లో పొలాల్లో నీటి కుంటలు జలసిరులను అందిస్తున్నాయి. జైపూర్ జిల్లా కుకాస్ గ్రామంలోని వాతావరణ ప్రతికూలతలను తట్టుకొని సాగు నీటి భద్రతను కల్పించే పరివర్తనాత్మక గ్రామీణ నీటి సంరక్షణ నమూనా అమల్లో ఉంది. ఈ గ్రామపరిసరాల్లోనే 50 వ్యవసాయ నీటి కుంటలు (ఫామ్ పాండ్స్)ను తవ్వారు. ఈ వర్షాకాలంలో వీటితో పది కోట్ల లీటర్ల వాన నీటిని ఒడిసిపట్టాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు. ఈ నీటి కుంటలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మించారు. వానాకాలంలో వాన నీటిని ఒడిసిపట్టి, ఏడాది పొడవునా పంటలకు సాగునీటి కొరత లేకుండా చూడటం ద్వారా గ్రామీణుల జీవనోపాధులను మెరుగుపరచటమే లక్ష్యంగా ఈ ఫామ్ పాండ్లను నిర్మించారు. ఈ ఫామ్ పాండ్లను ‘కుకాస్ నమూనా’ అని పిలుస్తున్నారు.
ఖరగ్పూర్ ఐఐటీ పూర్వ విద్యార్థి విప్ర గోయల్ ఈ నీటి కుంటల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికి 50 నీటి కుంటలు నిర్మించామని, మరో 25 నిర్మించబోతున్నామని ఆయన చెబుతున్నారు. వీటిలో వాన నీటిని సంరక్షిస్తే ఈ ప్రాంతంలో 50 వేల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వాన నీటిని రెండు పంటలకూ అందించే ఏర్పాటు చేసినందున తక్కువ నీటితో పండించగల పంటలు, అధికాదాయాన్నిచ్చే పంటలను శ్రద్ధగా సాగు చేసుకుంటూ స్వావలంబనతో జీవించే అవకాశం రైతులకు దక్కిందని కుకాస్ సర్పంచ్ రాధేశ్యాం మీనా సంతోషపడుతున్నారు.
జైపూర్ ప్రాంతంలో హెక్టారుకు 14 నుంచి 21 లక్షల లీటర్ల వాన నీరు వృథాగా పోతోందని గోయల్ లెక్కగట్టారు. నదులు, కాలువలు లేని ఈ ప్రాంతంలో నీటి కుంటలు ఆధారపడదగినవిగా ఉన్నాయన్నారు. నిరంతరం ఫామ్ పాండ్ ద్వారా నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాలు ఆదా అవుతాయన్నారు. గతంలో నీతి ఆయోగ్తో పనిచేసిన అనుభవం గల గోయల్ ఒక టూవీలర్ తయారీ కంపెనీ ఆర్ధిక సహకారంతో కుకాస్ గ్రామంలో వాననీటి సంరక్షణకు పామ్ పాండ్స్ నిర్మాణం చేయిస్తుండటం ప్రశంసనీయం. తన వంతు కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
కుకాస్ నమూనా ప్రత్యేకతలు
వానాకాలంలో వాన నీటి సంరక్షణ సామర్థ్యం: 10 కోట్ల లీటర్ల వానాకాలపు వరద నీటిని ఒడిసిపట్టుకోవాలి.
ఇదీ ఫామ్ పాండ్ డిజైన్: ప్లాస్టిక్ లైనింగ్, ప్రతి రైతు పొలంలో 5% స్థలంలో 10 అడుగుల లోతు తవ్వి ఫామ్ పాండ్ నిర్మాణం, చుట్టూ పకడ్బందీగా ఇనుప కంచె నిర్మాణం.
ప్రాజెక్టు పరిధి: దాస జిల్లాలో 250 నీటి కుంటల తవ్వకం ద్వారా వాననీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రతకు విజయవంతంగా కృషి చేసిన స్ఫూర్తితో కుకాస్ జిల్లాలో ఈ నమూనాను అమలు చేస్తున్నారు.
నీటి భద్రత, వ్యవసాయానికి జరిగిన మేళ్లు...
జైపూర్ జిల్లా వ్యవసాయం 99.4% మేరకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది.
భూమిలోకి వాన నీరు ఇంకేదానికన్నా 2.22 రెట్లు బోర్ల ద్వారా తోడేస్తున్నారు.
ఈ సమస్యను అధిగమించానికి ఫామ్ పాండ్స్ను నిర్మిస్తున్నారు.
ఖరీఫ్, రబీ పంటలకు నీటి అవసరాలు తీర్చటం కోసం వీటిని నిర్మిస్తున్నారు.
ఏడాది పొడవునా సాగయ్యే పంటలు, తోటల సాగు, పశువుల పెంపకం, ఉద్యాన తోటల పెంపకానికి దోహదం.
పంట మార్పిడిని ప్రోత్సహించటం.. ఉదా.. వేరుశనగ, బొబ్బర్లు.
చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష
సుస్థిరత, అభివృద్ధిపై ప్రభావం
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట దిగుబడులు తీసుకునే శక్తిని నీటి కుంటల వ్యవస్థ పెంపొందిస్తుంది. వైవిధ్యపూరితమైన జీవనోపాధులకు దోహదం చేస్తుంది. ఆహార భద్రతను కల్పిస్తుంది. పాడి పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి.